అన్యాయం జరగలేదు, బాబు ఇంటికి పంపి..: సిఆర్
హైదరాబాద్: రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరగలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సి రామచంద్రయ్య అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్రకు మంచి ప్యాకేజి ఇచ్చారని, అవసరమనుకుంటే మరిన్ని తెస్తామని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నాయకుల ఇంటికి తన మనుషులను పంపించి వారిని తన పార్టీలో చేర్పించుకుంటున్నారని ఆరోపించారు. పార్టీలు మారడం రాజకీయ వ్యభిచారం అన్నచంద్రబాబు, ఇప్పుడు చేస్తున్నదేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలన్నీ స్వచ్ఛందంగానే జరుగుతున్నాయని చెప్పారు.
పురుడు పోసి తల్లిని చంపారన్న భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారా అని రామచంద్రయ్య ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి బాలరాజు అన్నారు. సమైక్యం ముసుగులో ఎవరేం చేస్తున్నారో అర్థమవుతోందని ఆయన చెప్పారు. చంద్రబాబు విభజనకు ఒప్పుకున్నారా అని బాలరాజు ప్రశ్నించారు.
పిసిసిలపై స్పష్టత ఇవ్వాలని కోరాం: ఆనం
అనంతరం ఆనం రాంనారాయణ రెడ్డి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని బొత్స సత్యనారాయణను కోరినట్లు ఆనం తెలిపారు. డిసిసి, కాంగ్రెస్ సిటీ అధ్యక్షుల పదవులను భర్తీ చేయాలని కూడా కోరినట్లు ఆయన చెప్పారు. నాలుగు జిల్లాలకు కొత్త అధ్యక్షులను ఈ సమావేశంలో ప్రకటించినట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా వెంకటేశ్వరరావు, నెల్లూరు జిల్లాకు ఊడలమర్రి వేణుగోపాలరెడ్డి, అనంతపురం జిల్లాకు వై శివరెడ్డిలను ప్రకటించారు.
రైతుల సమస్యలపైనే ప్రధాన దృష్టి: కాసు
గుంటూరు: భవిష్యత్లో రైతుల సమస్యలపైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు రుణాలు ఇచ్చేందుకు సహకార వ్యవస్థ ద్వారా ఎంతో కృషి చేశామని చెప్పారు. 2013-14 ఖరీఫ్ సీజన్లో రైతులకు రూ.11,300 కోట్ల రుణాలిచ్చామని ఈ సందర్భంగా కాసు కృష్ణారెడ్డి తెలిపారు.