మాస్కుల చుట్టూ ఏపీ పాటిలిక్స్: మాస్కులు కూడా లేవ్: డాక్టర్ సుధాకర్ అటాక్: వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్
అమరావతి: రాష్ట్రంలో కరనా వైరస్ భయానకంగా విస్తరిస్తోన్న వేళ.. దాని చుట్టూ రాజకీయాలు ముసురుకుంటున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు లేవని, కరోనా పాజిటివ్ పేషెంట్లకు చికిత్సను అందిస్తోన్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి జగన్ సర్కార్ కనీసం మాస్కులను కూడా సరఫరా చేయలేకపోతోందని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ చేసిన ఆరోపణలు తాజాగా కలకలం రేపుతున్నాయి.
టీడీపీ అటాక్.. వైసీపీ కౌంటర్ అటాక్..
ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే పనిలో పడింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కరోనా వైరస్ సోకిన పేషెంట్లు, డాక్టర్ల, వైద్య సిబ్బంది కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) అందుబాటులో ఉన్నాయని చెబుతోంది. డాక్టర్ సుధాకర్ చేసిన ఆరోపణల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని వైఎస్ఆర్సీపీకి చెందిన నర్సీపట్నం శాసనసభ్యుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేయడానికి ముందు ఆయన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లొచ్చారని మండిపడుతున్నారు.
మాస్కులు లేవు.. చెబితే పట్టించుకోరు..
ఒక్క ఎన్95 మాస్క్ను కనీసం 15 రోజుల పాటు వినియోగించుకోవాలని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారని, దీనికి సంబంధించిన వీడియో కూడా తన వద్ద ఉందని డాక్టర్ సుధాకర్ వెల్లడించారు. 150 పడకల సామర్థ్యం గల నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు వైద్యం అందించడానికి కనీస సౌకర్యాలు లేవని, డాక్టర్లకు కూడా పీపీఈ కిట్లను అందించట్లేదని ఆయన విమర్శించారు. నర్సీపట్నం ఆసుపత్రిలో ఒక్క డాక్టర్ ఉండట్లేదని, కాంట్రాక్టు ప్రాతిపదిన ఓ గైనకాలజిస్ట్ మాత్రమే పని చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం డాక్టర్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆ పరిస్థితి ఏపీలో లేదని అన్నారు.
అయ్యన్న పాత్రుడి ఇంటికి ఎందుకెళ్లారంటూ..
ఆయన చేసిన విమర్శలను నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తోసిపుచ్చారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి ఆదేశాల మేరకే డాక్టర్ సుధాకర్ విమర్శలు చేశారని ఆయన ఎదురుదాడికి దిగారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ముందు ఆయన అయ్యన్న పాత్రుడి ఇంటికి వెళ్లొచ్చారని తెలిపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఆయన మీడియాకు విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లిన డాక్టర్ సుధాకర్ సాయంత్రం 5 గంటల తరువాత బయటికి వచ్చారని, అవన్నీ సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యాయని అన్నారు.
డాక్టర్ను కూడా పావులా..
చంద్రబాబు నాయుడు సంక్షోభ సమయాలను తనకు అవకాశంగా మార్చుకుంటూ ఉంటారని, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అదే పద్ధతిని పాటిస్తున్నారని ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. కరోనా వల్ల దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దీన్ని కూడా తమకు అనుకూలంగా, రాజకీయ అవసరాల కోసం టీడీపీ నాయకులు వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించామని, పీపీఈ కిట్లను అందజేశామని చెప్పారు. ఒక డాక్టర్ను కూడా పావులా వాడుకుంటున్నారని ఆరోపించారు. రెండు గంటల పాటు డాక్టర్తో తన ఇంట్లో అయ్యన్న పాత్రుడు ఏం చర్చలు జరిపారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.