ప్రతిపక్షాల తప్పుడు మాటలు...ఎంత వరద వచ్చినా రాజధాని మునగదు:సిఎం చంద్రబాబు
అమరావతి: రైతులు రాజధాని కోసం 33వేల ఎకరాలు త్యాగం చేస్తే...ప్రతిపక్ష నేతలు మాత్రం రాజధాని మునుగుతుందని...రాజధానిలో పనులు జరక్కుండానే లక్ష కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు మాటలు మాట్లాడారు. ఈ పథకానికి రోజుకు ఒక టీఎంసీ వరద వచ్చినా సమస్య లేదని సిఎం చంద్రబాబు చెప్పారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని వరద ముంపు నుంచి రక్షించేందుకు నిర్మించిన కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మీట నొక్కి పంపుహౌజ్లో మోటార్లను ప్రారంభించారు. ఉండవల్లి వద్ద కృష్ణానది కరకట్ట సమీపంలో రూ.2 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని నిర్మించారు. 5వేల క్యూసెక్కుల వరదనీటిని కృష్ణానదిలో ఎత్తిపోసేలా దీన్ని డిజైన్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ముందుగా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకంలో పాలుపంచుకున్న ఇంజినీర్లకు అభినందనలు తెలిపారు. మూడు రోజులుగా జలసిరికి హారతి కార్యక్రమం కొనసాగుతోందని, రాష్ట్రాన్ని కరువురహితంగా తీర్చిదిద్దేందుకు జలదీక్ష చేపట్టామని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో పూర్తిస్థాయిలో నీరు ఉందన్నారు. రాజధాని పరిధిలో చాలా ప్రాంతాలు వరదల కారణంగా మునిగిపోయేవని...అయితే ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం లభించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
రాజధాని ముంపు సమస్య నివారణకు రెండో దశలో 7 వేల క్యూసెక్కుల నీరు ఎత్తిపోసేలా రెండో విడత ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. నా జీవితంలో ఎప్పుడూ పెట్టనంత శ్రద్ధ జలవనరుల శాఖపై పెట్టానని...రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచేందుకు, వర్షపు నీరు నిల్వ చేసేందుకు చర్యలు తీసుకున్నానని సిఎం వివరించారు. తాను తీసుకున్న చర్యల వల్లే గత మూడేళ్లుగా పెద్దగా వర్షాలు లేకున్నా సమస్యలు రాలేదని...మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు 12 ప్రాజెక్టులు పూర్తి చేశామని...వచ్చే ఐదేళ్ల కాలంలో 45 ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా సాగుతున్నామని సిఎం ప్రకటించారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇంకా రూ.2,500 కోట్లు ఇవ్వాల్సి ఉందని చంద్రబాబు ఈ సందర్భంగా వెల్లడించారు. అయినా ప్రాజెక్టు పనులు ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టు పనులు ఇంత వేగంగా జరగట్లేదని చెప్పుకొచ్చారు. 2019 మే కల్లా పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నిరిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.