సవరణ అవసరంలేదు: జైపాల్, విభజన ఇప్పుడా: కిరణ్
న్యూఢిల్లీ/కడప: 371డికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో పది నిమిషాలు భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అధినేత్రితో తెలంగాణ అంశంపై మాట్లాడినట్లు చెప్పారు. తెలంగాణ ప్రక్రియను గట్టెక్కించేది కాంగ్రెసు పార్టీ అధిష్టానమే అన్నారు.
ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అసెంబ్లీ స్థానాలను పెంచాలన్న వాదనతో ఆయన ఏకీభవించారు. అసెంబ్లీ సీట్ల పెంపు సరైనదే అన్నారు. అయితే ముందు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలన్నారు.
ఇప్పుడు విభజన అవసరమా?: కిరణ్
ఇబ్బందుల మధ్య రాష్ట్ర విభజన అవసరమా అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కడప జిల్లా రాయచోటిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన సందర్భంలో తాను ముఖ్యమంత్రిని అయ్యానని, తాను కుర్చీ పైన కూర్చునే సమయానికి ఉద్యోగులకు, విద్యార్థులకు బకాయిలు ఉన్నాయని, ఎక్కడి పథకాలు అక్కడే ఆగిపోయాయన్నారు.
రాష్ట్రం కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుందని, ఇలాంటి ఇబ్బందుల మధ్య విభజన అవసరమా అని ప్రశ్నించారు. కలిసికట్టుగా ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. కొందరి స్వార్థం కోసం విభజన కోరుతున్నారన్నారు. రాయచోటిలో త్వరలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. కిరణ్ రాయచోటిలో రూ.97 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు.