'వాళ్లా హీరోలు?, దానివల్ల ఎవరికి లాభం, పిచ్చితనం వదలండి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ ఇటీవల మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు 'ఎవరి రాజధాని?' అంటూ ఓ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజయ్ కల్లం కూడా అమరావతి నిర్మాణంపై ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. పేరుకే మెగా రాజధాని నిర్మాణం అని.. అక్కడ సాగుతున్నదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం అని ఆరోపించారు. అధికార కేంద్రీకరణ అన్నది ఒక తప్పుడు ఆలోచనా విధానమని స్పష్టం చేశారు.
మెగా నగరాలతో ఏం లాభం?:
మెగా నగరాల ఆలోచనే అసంబద్ధమని అజయ్ కల్లం అభిప్రాయపడ్డారు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి తప్ప సామాన్య ప్రజలకు ఎందుకు ఉపయోగపడదని తేల్చి చెప్పారు.
'పెద్ద పెద్ద నగరాల వల్ల ప్రజలకు అన్ని విధాలా భారం తప్ప లాభం ఉండదు. అనుభవజ్ఞులు ఎవరూ మహా నగరాలను కట్టరు. నగరం పెద్దదయ్యే కొద్దీ రవాణా వ్యయం, నీటి సరఫరా రేటు, విద్య ఖర్చులు, ఇంటి అద్దె లాంటివన్నీ పెరుగుతాయి. జీవన వ్యయం భారీగా పెరుగుతుంది' అని చెప్పుకొచ్చారు.
పిచ్చితనం నుంచి బయటపడండి:
రాజధాని నిర్మాణం విషయంలో.. తామేదో పెద్ద తాజ్మహల్ను నిర్మించి చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోవాలనే పిచ్చితనపు ఆలోచనల నుంచి పాలకులు దూరం కావాలని కల్లం చెప్పారు. వారికేదో పేరు రావాలని ప్రజలు ఎన్నుకోలేదని, రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఎన్నుకున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి:
అధికార కేంద్రీకరణ అనేది మౌలిక సిద్ధాంతానికే వ్యతిరేకమని అజేయ కల్లం అన్నారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రైవేట్ సంస్థల కన్సార్టియం ప్రతిపాదన సరికాదన్నారు. తాను సర్వీసులో ఉన్న సమయంలో మెగా సిటీల నిర్మాణాలను తప్పు పట్టానని గుర్తుచేశారు.
మెగా సిటీలు నిర్మించడం ద్వారా నేరాలు, వ్యభిచారం, చెడు అలవాట్లు పెరుగుతాయి తప్ప ప్రజలకు మనశ్శాంతి కూడా ఉండదన్నారు. మహాత్మాగాంధీ చెప్పినట్టు ప్రజలకు కావాల్సింది గ్రామ స్వరాజ్యమేనని గుర్తుచేశారు. స్వయం సమృద్ధి, స్వయం పాలన గల చిన్న చిన్న పట్టణాలకు అభివృద్ధి ప్రాతిపదికలో ప్రాముఖ్యతనిస్తేనే రాష్ట్రం ముందుకు వెళ్తుందన్నారు.
వాళ్లా హీరోలు?:
రాష్ట్రంలో యువత ఆలోచనా విధానం కూడా మారాలని అజేయ కల్లం చెప్పారు. డ్రెస్సింగ్ రూమ్లో మేకప్లు వేసుకొని, ఎవరో రాసిచ్చిన డైలాగులు చదివేవారు హీరోలా?, లేక సమాజం కోసం నిరంతరం పాటు పడి త్యాగాలకు సైతం సిద్దపడ్డవాళ్లు అసలైన హీరోలా? ఆలోచించాలని హితవు పలికారు. సినిమాల్లో పెద్ద హీరో అయినంత మాత్రానా.. నిజ జీవితంలోనూ వాళ్లను అలాగే చూడటం సరికాదన్నారు.
దానివల్ల ఎవరికి లాభం?:
పెద్ద పెద్ద నగరాలుంటేనే పెద్ద సంస్థలు రాష్ట్రానికి వస్తాయని చెప్పడం ప్రజలను మభ్య పెట్టడమేనని అజేయ కల్లం విమర్శించారు. ఇందుకోసం కొన్ని ఉదాహరణలు చెప్పారు.
మైక్రోసాఫ్ట్ ప్రధాన కేంద్రం ఎక్కడుంది? అని ప్రశ్నించిన ఆయన.. లాస్ఏంజెలెస్, షికాగో, న్యూయార్క్ లాంటి నగరాల్లో లేదు కదా? అని గుర్తుచేశారు. అమెరికాలోని ఓ మారుమూల ప్రాంతమైన రెడ్మాండ్లో మైక్రోసాఫ్ట్ ప్రధాన కేంద్రం ఉందన్నారు.
వారెన్ బఫెట్ లాంటి బడా పారిశ్రామికవేత్త సైతం తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఒమాహా అనే మారుమూల ప్రాంతం నుంచే నడుపుతున్నారని గుర్తుచేశారు. పెద్ద నగరాల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకే లాభం తప్ప మరొకటి కాదన్నారు. స్థిరాస్తి ధరలను భారీగా పెంచి సొమ్ము చేసుకుంటారన్నారు.