పవన్ కళ్యాణ్! ఉపన్యాసాలు వద్దు!!: సిపిఎం నేత రాఘవులు
న్యూఢిల్లీ/ కాకినాడ: తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జనసేన అధినేత, సినీ హీరో పవన్ ఇప్పటికైనా స్పందించడం సంతోషమని సిపిఎం జాతీయ నేత బీవీ రాఘవులు అన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు.. కార్యాచరణ రూపొందించి పోరాటానికి దిగాలని సూచించారు. అప్పుడే పవన్ కళ్యాణ్తో అందరూ కలిసి వస్తారని రాఘవులు అభిప్రాయపడ్డారు.
ఇదిలావుండగా, గవర్నర్ వ్యవస్థ ఉత్సవ విగ్రహం లాంటిదని సీపీఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. దేశంలో మొత్తం గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం కాకినాడలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలుగు రాష్ర్టాల్లో నెలకొన్న సమస్యలకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. కేంద్రం ఆడిస్తున్న నాటకంలో భాగంగానే తెలుగు రాష్ర్టాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని నారాయణ ఆరోపించారు.