కొత్త జిల్లాలపై జగన్కు నిమ్మగడ్డ షాక్- స్ధానిక ఎన్నికలతో మెలిక- అసలు వ్యూహం అదేనా ?
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్న జగన్ సర్కారుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఊహించని షాక్ ఇచ్చారు. జిల్లాల విభజనకు సంబంధించి చేపట్టిన ప్రక్రియను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్నీకి నిమ్మగడ్డ లేఖ రాశారు. స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ పూర్తికాకుండా కొత్త జిల్లాల ఏర్పాటు చేపట్టవద్దని అందులో ఆదేశించారు. దీంతో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ముఖ్యంగా స్దానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుపడుతున్న ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకే నిమ్మగడ్డ ఈ ఆదేశాలు ఇచ్చారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
స్ధానిక పోరుకు వైసీపీ సర్కార్ అడ్డంకులు..
ఏపీలో కరోనా ప్రభావంతో వాయిదాపడిన స్ధానిక సంస్ధలు తిరిగి నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోంది. నిధులతో పాటు ఇతర సహకారం అందకుండా అడ్డంకులు సృష్టించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సానుకూల ఉత్తర్వులు తెచ్చుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించడమే కాకుండా అందుకు తగిన ఆధారాలు కూడా ఓ నివేదిక రూపంలో సమర్పించాలని హైకోర్టు గతంలో సూచించింది. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
కొత్త జిల్లాలకు పరుగులు...
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఓవైపు పాత జిల్లాల ఆధారంగా స్ధానిక సంస్ధల రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో ఎన్నికలు పూర్తికాకుండానే కొ త్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందు కోసం ఏర్పాటు చేసిన కమిటీలు ఇప్పటికే ఆ పనిలో బిజీగా ఉన్నాయి. త్వరలో కొత్త జిల్లాలపై ప్రజాభిప్రాయ సేకరణకు కూడా వెళ్లాలని జగన్ సర్కారు వ్యూహరచన చేస్తోంది. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు కూడా ఆదేశాలు వెళ్తున్నాయి. ఎలాగైనా వచ్చే ఏడాది ఆరంభంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన ఉంటుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తాజాగా ప్రకటించారు. దీంతో ప్రభుత్వం 13 జిల్లాల స్ధానంలో 32 జిల్లాల ఏర్పాటు చేయబోతోందనే లీకులు కూడా వస్తున్నాయి.
కొత్త జిల్లాలకు చెక్ పెట్టిన నిమ్మగడ్డ...
ఏపీలో స్ధానిక ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇప్పుడు ఎన్నికలు జరక్కుండానే కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో తిరిగి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన పరిస్దితి వస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ వేస్తూ చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్నీకి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తాజాగా లేఖ రాశారు. కొత్త జిల్లాల కోసం జరుగుతున్న ప్రక్రియను వాయిదా వేయాలని, స్ధానిక పోరు తర్వాతే జిల్లా విభజన పెట్టుకోవాలని ఆయన లేఖలో సూచించినట్లు తెలుస్తోంది.
Recommended Video
జిల్లాలకే కాదు జగన్కూ చెక్...
స్ధానిక ఎన్నికల నిర్వహణ కోసం ఖరారైన రిజర్వేషన్లను పట్టించుకోకుండా కొత్త జిల్లాల ఏర్పాటుకు పావులు కదుపుతున్న వైసీపీ సర్కారు ప్రయత్నాలకు నిమ్మగడ్డ నిర్ణయంతో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. స్ధానిక పోరు తర్వాతే కొత్త జిల్లాల ప్రక్రియ చేపట్టాలని నిమ్మగడ్డ రమేష్ వైసీపీ సర్కారును కోరడంతో జగన్ ఇప్పుడు దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎస్ఈసీ నిర్ణయాన్ని అమలు చేస్తూ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వాయిదా వేస్తారా లేక దీన్ని కోర్టుల్లో సవాల్ చేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అదే సమయంలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు అడ్డుపడుతున్న ప్రభుత్వానికి కొత్త జిల్లాలతో ఈ వ్యవహారాన్ని లింక్ చేయడం ద్వారా నిమ్మగడ్డ చెక్ పెట్టారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీంతో జగన్ సర్కారు సాధ్యమైనంత త్వరగా స్ధానిక పోరు నిర్వహించి, ఆ తర్వాతే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ నిర్వహించేలా నిమ్మగడ్డ నిర్ణయం పనిచేసే అవకాశమంది.