బిగ్ రిలీఫ్: ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదు: 217 మందికి పరీక్షలు నిర్వహించినా..
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న వేళ..లాక్డౌన్ విధించిన వేళ జనం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడానికి జంకుతోన్న సమయంలో.. వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ తీపి కబురును అందించారు. కొత్తగా రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించారు. బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన వైద్య పరీక్షల సందర్భంగా పాజిటివ్ కేసులేవీ రాలేదని తెలిపారు. ఫలితంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 348 వద్దే ఆగిపోయిందని అన్నారు.
ఈ 12 గంటల మధ్యకాలంలో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ ల్యాబొరేటరీల్లో 217 మంది నుంచి సేకరించిన రక్తాన్ని పరిశీలించారు అధికారులు. కరోనా వైరస్ సోకినట్టుగా భావిస్తోన్న అనుమానితులను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో ఉంచి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వారి నుంచి సేకరించిన రక్తాన్ని పరీక్షించగా.. ఈ 217 మందిలో ఏ ఒక్కరిలోనూ వైరస్ లక్షణాలు కనిపించలేదని తెలిపారు. ఈ మేరకు నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్ గురువారం ఓ బులెటిన్ను విడుదల చేశారు.
బుధవారం రాత్రి 9 నుంచి ఈ ఉదయం 9 గంటల మధ్యకాలంలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్యలో కూడా ఎలాంటి మార్పూ లేదని తెలిపారు. అదే సమయంలో- డిశ్చార్జీలు కూడా నమోదు కాలేదని అన్నారు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగాలని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. పలువురి రక్త నమూనాలకు సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నాయని, ఈ సాయంత్రానికి వాటి ఫలితాలు అందుతాయని అన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు.
జిల్లాలవారీగా అనంతపురం-6, చిత్తూరు-20, తూర్పు గోదావరి-11, గుంటూరు-41, కడప-28, కృష్ణా-35, కర్నూలు-74, నెల్లూరు-49, ప్రకాశం-24, విశాఖపట్నం-20, పశ్చిమ గోదావరి-21 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా పేషెంట్లు పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం అధికారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్టయింది.
Recommended Video