జగన్ని నమ్మట్లేదనే: రాజప్ప, 'చంద్రబాబు కేబినెట్ విస్తరణ వెనుక ప్లాన్'
అమరావతి: తన మాటలను ఎవరూ నమ్మడం లేదనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణలతో తమ ప్రభుత్వం పైన విమర్శలు చేయిస్తున్నారని హోంమంత్రి చినరాజప్ప ఆదివారం నాడు మండిపడ్డారు.
జగన్ కుహనా రాజకీయాలు నడుపుతున్నారన్నారు. నారా లోకేష్, తానూ మాట్లాడిన మాటల వీడియోను బయట పెట్టినప్పటికీ, వారి అసత్య ప్రచారం ఆగలేదన్నారు. తాను టిడిపిలో ఓ కుటుంబ సభ్యుడినని, చంద్రబాబు తనను సొంత సోదరుడిలా చూసుకుంటారన్నారు.
సాక్షి పత్రికలో వస్తున్న వార్తలన్నీ తప్పుడు వార్తలేనన్నారు. బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు చేస్తున్న విమర్శలను సైతం ప్రజలు నమ్మని రోజులు వచ్చాయన్నారు. కేబినెట్ విస్తరణ పైన సీఎం చంద్రబాబు తుది నిర్ణయం అన్నారు. వైసిపి నేతలకు విమర్శ తప్ప ఏం తెలియదన్నారు.
అందుకే కేబినెట్ విస్తరణ: రఘువీరా
చంద్రబాబు నాయుడు తన కేబినెట్ను త్వరలో విస్తరిస్తారనే ఊహాగానాల పైన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆదివారం నాడు స్పందించారు. ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించేందుకే మంత్రివర్గ విస్తరణ అని ఆరోపించారు.
చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. విశాఖలో రూ.4.5 లక్షల ఎంవోయులు కుదుర్చుకున్నామని చంద్రబాబు చెప్పారని, అవి ఏమయ్యాయో చెప్పాలని నిలదీశారు.
దళితులను అవమానించిన చంద్రబాబు దళిత బాట చేపట్టడం విడ్డూరమన్నారు. ఏపీలో గిరిజన శాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే వైసిపి నుంచి టిడిపిలో చేరిన వారితో రాజీనామా చేయించి పోటీ చేయించి, గెలిపించుకోవాలన్నారు.