వైయస్ రాజశేఖర రెడ్డి దెబ్బకు భయపడే చంద్రబాబు వద్దకు కేసీఆర్ వచ్చారా?
విజయవాడ/తిరుమల: ఏపీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వాడిన భాష సరైనది కాదని ఏపీ మంత్రులు ఆదినారాయణ రెడ్డి, కొల్లు రవీంద్రలు ఆదివారం అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు అప్రజాస్వామికమన్నారు.
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు చుక్కలు చూపిస్తాం: టీడీపీ అటాక్
20 లక్షల ఓట్లును తొలగించి ఎన్నికలను ఏకపక్షంగా జరిపించారన్నారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ను ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే చంద్రబాబుపై ఆయన విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి సాధిస్తోందన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ఏమయ్యారో తెలుసుగా
తల్లి కడుపులో నుంచి ఎందుకు బయటకు వచ్చామా అని బాధపడేలా చేస్తానని అసెంబ్లీలో వైయస్ రాజశేఖర రెడ్డి.. చంద్రబాబును ఉద్దేశించి అన్నారని, చివరకు ఆయన ఏమయ్యారో తెలుసుగా అని బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబుపై కేసీఆర్ చేసిన విమర్శలపై ఆయన నిప్పులు చెరిగారు. సాక్షాత్తు కేటీఆర్ ఈ రాష్ట్రానికి ఐటీ తీసుకు వచ్చింది చంద్రబాబు నాయుడని చెప్పారని, ప్రత్యేక హోదాకు మద్దతని మీరు చెబుతున్నారని, మీ మద్దతు ఎక్కడ అని ప్రశ్నించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రసంగంలో హరీష్ రావు ప్రత్యేక హోదాకు వ్యతిరేకమని చెప్పారని, ఈ మాటలన్నీ మరచిపోయి ప్రధాని మోడీ ఏదైతే రాసిచ్చారో దానినే కేసీఆర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అది సరికాదన్నారు.
వైయస్ నాశనం చేస్తే భయపడి చంద్రబాబు వద్దకు వచ్చావ్
ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలంతా నీలాంటి వ్యక్తి మాటలు విని సిగ్గు పడుతున్నారని కేసీఆర్పై బుద్ధా నిప్పులు చెరిగారు. పొరుగు రాష్ట్రాల సీఎంలు ఎవరూ ఏపీ గురించి మాట్లాడటం లేదని, తెలుగువాడివయ్యుండి సహకరించాల్సింది పోయి మోడీ చెప్పినట్టు మాట్లాడుతున్నావని, 2009లో తెరాసకు వచ్చిన సీట్లు టీడీపీతో పొత్తు కారణంగా చంద్రబాబు దయాదాక్షిణ్యాల పైన వచ్చిన సీట్లు అన్నారు. నాడు వైయస్ తెరాసను సర్వనాశనం చేసి, విలీనం చేసుకుందామని చెబితే భయంతో చంద్రబాబు వద్దకు వచ్చావని విమర్శించారు.
కేటీఆర్ అలా ఎమ్మెల్యే అయ్యారు
2009 మహాకూటమి కారణంగానే సిరిసిల్ల నుంచి కేటీఆర్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారని బుద్ధా అన్నారు. చంద్రబాబు కూడా తెలంగాణ కోసం పోరాడారని చెప్పారు. విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. మోడీకి చంద్రబాబుపై ఉన్న అక్కసు.. ఇలా కేసీఆర్ మాటల ద్వారా బయటపడిందన్నారు. కేసీఆర్, జగన్లు మోడీ చెప్పినట్లుగా వింటూ ఏపీపై విషం కక్కుతున్నారన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్.. టీడీపీ అధినేతపై ఎంత గొప్పగా చెప్పారో అందరికీ తెలుసునని చెప్పారు. ఒడిశా, కోల్కతా, ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ ఎక్కడెక్కడ, ఎందుకు తిరిగారో చెప్పాలని నిలదీశారు.
చేతనైతే సాయం చేయి లేదా నోరు మూసుకో
నాడు వైయస్ రాజశేఖర రెడ్డి ఏం తిట్టినా చంద్రబాబు ఏమీ అనలేదని బుద్ధా అన్నారు. చంద్రబాబు ప్రజల కోసం పోరాడే వ్యక్తి అని చెప్పారు. కానీ ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ఒడ్డున కూర్చున్నామని ఏం మాట్లాడినా చెల్లుతుందంటే ఎలా అన్నారు. మోడీ ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం మానుకోవాలన్నారు. కేసీఆర్కు చేతనైతే సాయం చేయాలి లేదంటే నోరు మూసుకోవాలన్నారు.