కరోనాను ఎవరూ ఆపలేరు, అందరికీ ఈ మహమ్మారి సోకవచ్చు: సీఎం వైఎస్ జగన్ సంచలనం
అమరావతి: రానున్న కాలంలో కరోనా మహమ్మారి నుంచి ఎవరూ తప్పించుకోలేరేమోనని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ కొత్త సేవల విస్తరణ కారణంగా జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకూ వైరస్తో కలిసి జీవించాల్సిందేనని అన్నారు. అయితే కరోనా సోకిన వెంటనే ఏం చేయాలో అందిరికీ తెలిసి ఉండాలని చెప్పారు. దీనిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్లకు సీఎం సూచించారు.
ఎవరికి ఫోన చేయాలి? ఏం చేయాలన్నదానిపై విస్తృత ప్రచారం చేసి అవగాహన కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రాల సరిహద్దులు తెరిచినందున రాకపోకలు పెరుగుతాయని, దీంతో కరోనా కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అన్నారు. దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారిని దూరం ఉంచవచ్చని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం కరోనా బారినపడ్డవారిలో చాలా మంది ఇంటి వద్ద ఉండే వ్యాధిని నయం చేసుకునే పరిస్థితి ఉందన్నారు. తక్కువ సంఖ్యలో మాత్రమే ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారని, మొత్తం రోగుల్లో కేవలం 4 శాతం మాత్రమే ఐసీయూల్లో ఉంటుంటున్నారని సీఎం వివరించారు. వ్యాక్సిన్ వచ్చే వరకూ కరోనా సంక్రమణను ఎవరూ ఆపలేరని అన్నారు.
Recommended Video
కాగా, ఏపీలో కరోనా కేసులు మరింతగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 2593 మంది వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రంలో కొత్తగా 2593 మందికి వైరస్ సోకగా.. అందులో ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లు కేవలం 9 మందే ఉన్నారు. లోకల్ వ్యక్తుల సంఖ్య 2,584. గురువారం నాటి కొత్త కేసులతో ఏపీ ట్యాలీ 38,044కు పెరిగింది. 50 శాతానికిపైగా రికవరీ రేటుతో 19,393మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. వారం రోజులుగా కొత్త కేసుల నమోదు భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య 18,159కి పెరిగింది.