ఎన్టీఆర్ క్వాలిటీ ఒక్కటీ లేదు: గట్టు, జగన్పై కేఈ
హైదరాబాద్: ఎన్టీఆర్లో ఉన్న లక్షణాల్లో ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో లేదని తెరాస నేత గట్టు రామచంద్ర రావు అన్నారు. ఏపీలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెవేర్చలేకే మహానాడును హైదరాబాదులె పెట్టారన్నారు.
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఖబడ్దార్ అనే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. ఏపీలో చంద్రబాబు అరాచకవాదిగా మారారన్నారు.
దోచుకున్న డబ్బుతో జగన్ ధర్నాలు: కేఈ
2019 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఏపీ చంద్రబాబు పయనిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. ఎలాంటి లక్ష్యం లేని నేత జగన్ అని విమర్శించారు.
దోచుకున్న, దాచుకున్న డబ్బుతో జగన్ ధర్నాలు చేస్తున్నారన్నారు. జిల్లా రైతులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పారు. ఇక్కడ ప్రారంభిస్తున్న పథకాలను కర్నూలు జిల్లాలోనూ ప్రారంభించాలని సీఎంను కోరినట్టు చెప్పారు.
బాబు ఏడాది పాలనపై కాంగ్రెస్ వాస్తవికత పత్రం
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీడీపీ ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యాలపై సభ నిర్వహించారు. దీనికి పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, కేవీపీ రామచంద్ర రావు సహా పలువురు నేతలు హాజరయ్యారు. చంద్రబాబు ఏడాది పాలనా వైఫల్యాలపై వాస్తవిక పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
జూన్ 8న రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. చంద్రబాబు మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారని, కానీ ఏడాదిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ప్రత్యేక హోదాపై టీడీపీ దగానాడులో తీర్మానం చేయకుండా ప్రజలను మరోసారి మోసం చేశారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే జూన్ 8న జరిగే సభలో వాస్తవిక పత్రానికి సమాధానం చెప్పాలన్నారు.