ఏ పార్టీ ఆహ్వానించలేదు, సెప్టెంబర్ చివర్లో, అమరావతి బాండ్లపై అలా ఇబ్బంది: లక్ష్మీనారాయణ
విజయవాడ: వచ్చే నెల చివరలో తన కార్యాచరణను ప్రకటిస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మంగళవారం చెప్పారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. కృష్ణా జిల్లాలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యం అణిచివేతకు గురవుతుందని వాపోయారు. అయిదేళ్లకు ఓసారి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు.
ప్రత్యేక అధికారుల నియామకంతో కేంద్రం నుంచి నిధులు రాకుండా పోతాయని చెప్పారు. ఇప్పుడు ఉన్న సర్పంచ్లను ఆపద్ధర్మ సర్పంచ్లుగా ప్రకటించాలన్నారు. ప్రత్యేక అధికారుల నియామకంతో 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు కోల్పోతామన్నారు.
అమరావతి బాండ్లు 10 శాతం కన్నా ఎక్కువ వడ్డీ ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. తనకు ఏ రాజకీయ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదని చెప్పారు. పోటీ చేసేది లేదనిది సెప్టెంబర్ నెల ఆఖరులో ప్రకటిస్తానని తెలిపారు. ఇంకా మూడు జిల్లాల్లో పర్యటించాల్సి ఉందని చెప్పారు.
నీళ్లు అందిస్తాం: చంద్రబాబు
ఏపీలో 2 కోట్ల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు వేరుగా అన్నారు. వడ్లమూడిలోని సంగం డెయిరీ ఆవరణలో ధూళిపాళ్ల వీరయ్య చౌదరి స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.11 కోట్లతో ఏర్పాటు చేసిన డీవీసీ ఆసుపత్రిని ప్రారంభించారు. మాజీ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు.
వీరయ్య చౌదరి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన చూపిన బాటలో దూళిపాళ్ల నరేంద్ర శాశ్వత అభివృద్ధి పనులు చేస్తున్నారని కితాబిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి వైద్యం అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు. ఏపీకి డీవీసీ ఆసుపత్రి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వపరంగా వచ్చే బీమా, ఇతర పథకాలన్నీ డీవీసీకి వర్తింపజేస్తామన్నారు.