చంద్రబాబుపై గండ్ర, వినలేదని పురంధేశ్వరిపై ద్రోణంరాజు
వరంగల్/విశాఖ: కాంగ్రెసు పార్టీని తిడితే ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని నారా చంద్రబాబు నాయుడు అనుకోవడం అమాయకత్వమని మాజీ ప్రభుత్వ చీఫ్ గండ్ర వెంకటరమణ రెడ్డి గురువారం అన్నారు. ఏ పార్టీలతో పొత్తుల కోసం కాంగ్రెసు పార్టీ వెంపర్లాడదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు వద్దని తమ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాయికి మించి మాట్లాడుతున్నారన్నారు.
పురంధేశ్వరి చేరికపై ద్రోణంరాజు
మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరితో కాంగ్రెస్ నేతలు ద్రోణంరాజు శ్రీనివాస్, మళ్ల విజయ్ ప్రసాద్ గురువారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీని వీడవద్దని పురందేశ్వరిని నేతలు కోరగా, ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, వెనక్కి రాలేమని స్పష్టం చేశారు.
పురంధేశ్వరితో భేటీ అనంతరం ద్రోణంరాజు మాట్లాడారు. పురంధేశ్వరి దంపతులు పార్టీని వీడటం బాధాకరమన్నారు. వారి నిర్ణయం తమను బాధించిందన్నారు. విభజనలో బిజెపి, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల పాపం కూడా ఉందని, అలాంటి పార్టీలలో ఆమె చేరాలనుకోవడం సరికాదన్నారు. కాంగ్రెసు పార్టీలోనే కొనసాగాలని తాము సూచిస్తే ఆమె తిరస్కరించారన్నారు.