Executive Capital: విశాఖవాసులకు తీపి కబురు: షాపింగ్ మాల్స్..మల్టీప్లెక్స్లల్లో దోపిడీకి బ్రేక్..!
విశాఖపట్నం: రాష్ట్ర పరిపాలనకు గుండెాకాయగా ఆవిర్భవించబోతోన్న సాగర నగరం విశాఖపట్నంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే వరాల జల్లును కురిపించింది. లైట్ మెట్రో రైలు, మిలీనియం టవర్-బీ నిర్మాణం.. వంటి వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా.. మరో తీపి కబురును అందించింది. ఇకపై విశాఖపట్నంలోని ప్రైవేటు వాణిజ్య సముదాయాల్లో నో పార్కింగ్ ఫీజు విధానాన్ని తీసుకుని రానుంది.
జాతీయవాదానికి కొత్త అర్థం చెప్పిన ఆర్ఎస్ఎస్ చీఫ్: ఏకంగా హిట్లర్తోనే ముడిపెట్టి...!
షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్లల్లో..
షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్ వంటి భారీ వ్యాపార సముదాయాల్లో వాహనాల పార్కింగ్ పేరుతో వాహనదారులను అడ్డంగా దోచుకుంటూ ఉంటారు అక్కడి సిబ్బంది. గంటకు ఇంత చొప్పున ఇష్టానుసారంగా పార్కింగ్ ఫీజులను వసూలు చేస్తుంటారు. షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్లల్లో కనీస పార్కింగ్ ఫీజు 30 రూపాయలు ఉంటుంది. అక్కడ ఆరంభం అయ్యే దోపిడీ వంద రూపాయలను మించి పోతుంటుంది. ఎన్ని గంటలు వాహనాన్ని పార్క్ చేసి ఉంచితే.. అంత భారాన్ని మోపుతుంటారు వాహనదారుడి మీద.
ఇకపై చెల్లవ్..
ఇకపై విశాఖపట్నంలోని ప్రైవేటు వాణిజ్య భవన సముదాయాల్లో ఇలాంటి దోపిడీ చెల్లదు. దీని చెక్ పెట్టింది ప్రభుత్వం. షాపింగ్ కాంప్లెక్సులు, మల్టీ ప్లెక్సుల్లో వాహనాల పార్కింగ్ ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసింది. తొలి 30 నిమిషాల పాటు ఎలాంటి ఫీజులను చెల్లించాల్సి ఉండదు. అనంతరం 30 నిమిషాల నుంచి 59 నిమిషాలలోపు షాపింగ్ మాల్లో ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే.. పార్కింగ్ ఫీజును వసూలు చేయరు. 60 నిమిషాలు, ఆపై- నిర్దేశించిన పార్కింగ్ ఛార్జీ కంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఏదైనా వస్తువును కొంటే.. పార్కింగ్ ఫీజును కట్టాల్సిన పని లేదు.
Recommended Video
మార్కెట్లు, ప్రభుత్వ భవన స్థలాల్లో పార్కింగ్పై నామమాత్రపు ఛార్జీలు
కాగా.. మార్కెట్లు వంటి ప్రభుత్వ స్థలాల్లో ఇకపై నామమాత్రపు ఛార్జీలను వసూలు చేస్తారు. మార్కెట్ల వంటి ప్రభుత్వ స్థలాలను పార్కింగ్ ఫీజు రహితంగా మార్చడం వల్ల వాహనదారులు గంటల పాటు అక్కడే వాహనాలను నిలిపివేస్తారని, ఫలితంగా నిజంగా అవసరం ఉన్న వాహనదారులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని జీవీఎంసీ అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్ల వంటి ప్రభుత్వ స్థలాల్లో నామమాత్రపు ఛార్జీలను వసూలు చేస్తామని జీవీఎంసీ కమిషనర్ గుమ్మళ్ల సృజన తెలిపారు.