జనసేనతోనే టిడిపికి నష్టం జరిగింది: వైసిపి పై ఆ ఎఫెక్ట్ పడింది: ఎన్నికల పై జోగయ్య సంచలనం..!
Recommended Video
ఏపిలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ సరళి పై ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. తమదే గెలుపు అంటే తమదే అంటూ పార్టీల అధినేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ వేత్త హరి రామ జోగయ్య ఎన్నికల సరళి పై కొత్త విశ్లేషణ తెర మీదకు తీసుకొచ్చారు. ఈ విశ్లేషణ ద్వారా గెలుపు మాదంటే మాది అంటున్న రెండు ప్రధాన పార్టీల్లోనూ చర్చ మొదలైంది.
90 స్థానాలు మించి రావు..
ఏపిలో జరిగిన హోరా హోరీ ఎన్నికల పై ఇప్పటికీ రెండు ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. టిడిపి తమకు పెన్షనర్లు..పసుపు - కుంకుమ లబ్దిదారులు పెద్ద ఎత్తున తమకు మద్దతు ప్రకటించారని అదే తమను గెలిపిస్తుందని టిడిపి ఆశలు పెట్టుకుంది. ఇదే సమయంలో వైసిపి తమ నవరత్నాలు తమను గెలిపిస్తాయని ధీమాగా చెబుతున్నారు. అయితే, హరిరామజోగయ్య మాత్రం తనదైన విశ్లేషణ చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి 90 స్థానాలు మించి వచ్చే పరిస్థితి కనిపించం లేదని చెప్పుకొచ్చారు. పందేలు కాసి నష్టపోవద్దని సూచించారు. అదే సమయం లో జోగయ్య ఆసక్తి కర అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. టిడిపి..వైసిపికి ఏ రకమైన నష్టం జరిగిందనే దాని పై కొత్త సమీకరణను తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో..ఇప్పుడు రెండు పార్టీలు ఈ విశ్లేషణ పై దృష్టి పెట్టాయి.
టిడిపి కి పవన్ తో నష్టం జరిగింది..
హరిరామజోగయ్య చేసిన విశ్లేషణలో ఒక ఆసక్తి కర సమీకరణ చెప్పుకొచ్చారు. టిడిపికి పసుపు - కుంకుమ వలన కలిగే లాభం కంటే జనసేన వలన జరిగే నష్టమే ఎక్కువ అని విశ్లేషించారు. సరిగ్గా ఎన్నికలకు మూడు నెలలు ముందుగా ఏపి ప్రభుత్వం రెండో విడత పసుపు కుంకుమ కింద ఒక్కో డ్వాక్రా మహిళకు మూడు విడతల్లో పది వేల రూపాయాలు చెల్లించేలా ప్రణాళిక సిద్దం చేసింది. సరిగ్గా పోలింగ్ ముందు రోజు మూడో విడత పసుపు-కుంకుమ నగదు డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ అయ్యేలా వ్యూహం అమలు చేసింది. దీంతో..ఏపిలో దాదాపు 94 లక్షల మంది ఉన్న డ్వాక్రా మహిళలు తమను ఆదరిస్తారని..తమకే ఓట్లు వేస్తారని టిడిపి అంచనా వేసింది. అయితే, దీని వలన కలిగే లాభం కంటే జనసేన వలన కలిగే నష్టం ఎక్కవ అని జోగయ్య చెబుతున్న దాని పైనా టిడిపి విశ్లేషణ ప్రారంభించింది. 2014 ఎన్నికల్లో పవన్ మద్దతు కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో టిడిపికి పెద్ద ఎత్తున కలిసి వచ్చింది. ఇప్పుడు పవన్ కారణంగానే అదే ప్రాంతంలో నష్టం జరిగిందా.. జరిగితే ఏ స్థాయిలో ఉంటుందనే దాని పై లెక్కలు వేస్తున్నారు.
వైసిపి కి నష్టం ఆ విధంగా..
ఇక, టిడిపికి జనసేన కారణంగా నష్టం జరిగిందని చెబుతున్న హరిరామజోగయ్య వైసిపి విషయంలోనూ కొత్త విశ్లేషణ ను తెర మీదకు తీసుకొచ్చారు. గత ఎన్నికల కంటే ఇప్పుడు ఏ వర్గాన్ని వైసిపి కొత్తగా ఆకర్షించలేకపోయిందన్నది ఆయన విశ్లేషణ. జనసేన పార్టీ బీఎస్పీతో జత కట్టడం వలన ఎస్సీ ఓట్లలో చీలక వచ్చిందని..ఇది వైసీపీకి నష్టం చేస్తుందని జోగయ్య చెబుతున్నారు. అయితే, జోగయ్య చెబుతున్న స్థాయిలో ఎస్సీల్లో ఓట్ల చీలక జరిగితే ఖచ్చితంగా అది వైసిపికి నష్టం చేస్తుందనే అభిప్రాయం ఉంది. కానీ, ఏపిలో స్థానిక పార్టీలను కాదని బీఎస్పీ లాంటి పార్టీలకు ఓటు వేసే పరిస్థితి నామ మాత్రంగానే ఉంటుందని..అది వైసిపి పై అంతగా ప్రభావం చూపే విధంగా ఉండదని వైసిపి నేతలు విశ్లేషిస్తున్నారు.