ముద్రగడ పాదయాత్ర: అనుమతి లేదు, అతిక్రమిస్తే చర్యలు
చలో అమరావతి పాదయాత్రకు అనుమతిలేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఆయన చెప్పారు.
విజయవాడ: చలో అమరావతి పాదయాత్రకు అనుమతిలేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఆయన చెప్పారు.
మంగళవారం నాడు ఏపీ డీజీపి సాంబశివరావు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలో ఎవరూ పాల్గొనకూడదని ఆయన కోరారు. ప్రస్తుతం 30, 144 సెక్షన్లు అమల్లో ఉన్నాయని ఆయన చెప్పారు..
పోలీసుల వలయంలో కిర్లంపూడి, అడుగడుగునా చెక్పోస్టులు
నిబంధనలు అతిక్రమించి పాదయాత్రలో పాల్గొంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. ముద్రగడ పాదయాత్రకు భయపడేదిలేదని అలాగే వెనకడుగు వేసేదిలేదన్నారు.
కాపు నేతలు గతంలోనూ విధ్వంసాలకు పాల్పడ్డారని ఎవరైనా ఆస్తులు ధ్వంసం చేస్తే కేసులు పెడతామన్నారు. సంఘ విద్రోహశక్తులు పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటే చూస్తూ ఊరుకోమని డీజీపీ వార్నింగ్ ఇచ్చారు.
చట్టంపై గౌరవం లేకుంటే అందరికీ నష్టం జరుగుతోందన్నారు. ఇక ఏపీలో డ్రగ్స్ కంటే గంజాయి సమస్య ఎక్కువగా ఉందన్నారు. గంజాయి సరఫరా చాలా విధాలుగా జరుగుతోందన్నారు. అలాగే బెల్ట్షాపులపై చర్యలు చేపడుతామన్నారు.
మరోవైపు ముద్రగడ పాదయాత్ర దృష్ట్యా ఏపీ సచివాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. వెంకటపాలెం, మందడం గ్రామాల్లో పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. ఎటువంటి ర్యాలీలు ఆందోళనకు అనుమతి లేదన్నారు.