ర్యాలీలకు పోలీసుల ఆంక్షలు .. కొనసాగుతున్న అరెస్ట్ ల పర్వం .. ఇంటి ముందే చింతమనేని నిరసన
అమరావతి రాజధాని ప్రాంతం రణరంగాన్ని తలపిస్తోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాజధాని గ్రామాల ప్రజలు సాగిస్తున్న ఉద్యమం ఉధృత రూపం దాలుస్తుంది. అందోళనలు, అరెస్టులతో రాజధాని అమరావతి అట్టుడుకుతోంది. 24 రోజులుగా నిరసనలు తెలుపుతున్నా.. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోవడంతో.. మహాధర్నాలు, హైవే దిగ్భంధానాలు, రిలే దీక్షలతో ఉద్యామాన్ని ఉధృతం చేస్తున్నారు రాజధాని ప్రజలు .
రాజధాని అమరావతి పోరాటం... మరో రైతు కూలీ ఆత్మహత్య .. గ్రామాల్లో ఉద్రిక్తత
ర్యాలీలకు అనుమతివ్వని పోలీసులు .. అడుగడుగునా ఆంక్షలు
అయితే మరోవైపు ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. శాంతియుతంగా తమ ఆందోళన తెలియజేస్తామని చెప్పినా ర్యాలీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వటం లేదు. అంతే కాదు అనుమతులు లేని ర్యాలీలలో పాల్గోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే పేరుతో ఎక్కడిక్కడ టీడీపీ లీడర్లను.. జేఏసీ నేతలను అడ్డుకుంటున్నారు. ముందస్తుగానే హౌస్ అరెస్టులు, అరెస్ట్ లు చేస్తున్నారు.
టీడీపీ నేతల గృహ నిర్బంధాలు .. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు అరెస్ట్
అమరావతి రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ ముఖ్యనాయకులను గృహ నిర్బంధాలకు గురి చేస్తున్నారు. ఎంపీ కేశనేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వ్యక్తిగత పనిపై బయటకు వెళ్తున్నా అని చెప్పినా కూడా పోలీసులు ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి జంక్షన్ దగ్గర జాతీయ రహదారిపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడ్ని పోలీసులు అడ్డుకున్నారు.
అమరావతి పరిరక్షణ బస్సుయాత్ర నేపధ్యంలో చింతమనేని హౌస్ అరెస్ట్ ..
రైతుల కోసం రాజమండ్రి వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని కలవడానికి వస్తున్న నేపథ్యంలో తణుకులో రామానాయుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అటు ఏలూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అమరావతి పరిరక్షణ బస్సుయాత్ర నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు చింతమనేనిని అరెస్ట్ చేశారు. ఏలూరు, దెందులూరు హైవే మీదుగా, తాడేపల్లిగూడెం, తణుకు నుండి చంద్రబాబు బస్సుయాత్ర కొనసాగాల్సి ఉంది.
ఇంటి ముందేచింతమనేని ప్రభాకర్ ఆందోళన
ఈ నేపథ్యంలో ముందస్తుగా చింతమనేని ప్రభాకర్ను హౌస్ అరెస్ట్ చేశారు.దీంతో చింతమనేని ఇంటి ముందు బైఠాయించి మరీ ఆందోళన చేస్తున్నారు. కనీసం తమ పార్టీ అధినేత చంద్రబాబును కూడా కలవకుండా పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని చింతమనేని తన ఇంటి ముందే ఆందోళనకు దిగారు. మొత్తానికి టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని రైతుల కోసం సాగిస్తున్న పోరాటం కొనసాగుతుంది. అరెస్ట్ లతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది.