ఊరించి షాకిచ్చారు: తెలుగువారిని పక్కన పెట్టిన మోడీ, అందుకే!
కేంద్ర కేబినెట్లో ఈసారి తెలుగువారికి చోటు దక్కలేదు. తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్కు కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సురేశ్ ప్రభుకు ప్రాతినిధ్యం లభించింది.
హైదరాబాద్/అమరావతి: కేంద్ర కేబినెట్లో ఈసారి తెలుగువారికి చోటు దక్కలేదు. తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్కు కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సురేశ్ ప్రభుకు ప్రాతినిధ్యం లభించింది.
ఏ మంత్రికి ఏ శాఖ?: నిర్మలకు రక్షణ, అశోక్-సుజనలకు పాతవే
టిడిపి ఎంపీలు అయిన కేంద్రమంత్రులకు పాత శాఖలనే అట్టిపెట్టారు. అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిల శాఖలు మారలేదు. తెలుగు వారికి తాజా కేబినెట్లో ఒక్క శాఖ కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
తొలుత తెలుగువారికి ఇలా..
ప్రారంభంలో తెలుగు రాష్ట్రాలకు మంచి ప్రాధాన్యత లభించింది. వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు వంటి వారు కేంద్రమంత్రులుగా ఉంటూ వస్తున్నారు. వెంకయ్యకు మంచి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.
వెంకయ్య నుంచి దత్తాత్రేయ వరకు
ఇటీవల కేంద్రంలో కీలకంగా ఉన్న వెంకయ్య నాయుడును ఉప రాష్ట్రపతిగా పంపించారు. క్రియాశీలక రాజకీయాల్లో నుంచి వెళ్లిపోవడం ఆయనకు ఇష్టంలేదు. కానీ పలు అంశాలను లెక్కలోకి తీసుకొని ఆయనను ఉప రాష్ట్రపతి చేశారు. ఆ తర్వాత కేబినెట్ విస్తరణకు ముందు బండారు దత్తాత్రేయతో రాజీనామా చేయించారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు కేంద్రమంత్రి పదవులు దూరయ్యాయి.
ఏపీ, తెలంగాణ ఆశలు
ఇటీవలి కాలంలో ఏపీ నుంచి వెంకయ్య నాయుడు, తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయలు కేబినెట్ నుంచి దూరం కావడంతో.. వారి స్థానంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కుతుందని అందరూ భావించారు.
వీరి పేరు తెరపైకి
ఏపీ నుంచి ఎంపీలు హరిబాబు, గోకరాజు రంగరాజుల పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో ఎవరో ఒకరికి కచ్చితంగా పదవి వస్తుందని భావించారు. అంతేకాదు, శనివారం రాత్రి హైకమాండ్ పిలుపు మేరకు హరిబాబు హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. దీంతో హరిబాబును కేబినెట్లోకి తీసుకోనున్నారనే ఆశలు రేకెత్తాయి. కానీ ఆదివారం కేబినెట్ విస్తరణలో హరిబాబుకు చోటు దక్కలేదు.
తెలంగాణ నుంచి వీరిపేర్లు.. తెలంగాణకు సున్నా
మరోవైపు, తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ స్థానంలో మురళీధర రావుకు లేదా వెదిరే శ్రీరాంకు అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ వీరిని కూడా కేబినెట్లోకి తీసుకోలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు మంత్రి పదవులు పోయినందుకు... కనీసం ఒక్కటైనా రాలేదనే అసంతృప్తి నెలకొంది. దత్తాత్రేయ రాజీనామా నేపథ్యంలో తెలంగాణకు కేంద్రమంత్రి పోస్టు కూడా లేకుండా పోయింది. దత్తాత్రేయ శాఖను గాంగ్వార్కు ఇచ్చారు.
ఊరించి షాకిచ్చారు
హరిబాబుకు, మురళీధర రావు వంటి వారికి కేబినెట్లో చోటు దక్కుతుందని మూడు రోజులుగా పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అధిష్టానం కూడా వీరితో పాటు పలువురి పేర్లను పరిశీలించింది. కానీ ఊరించి చివరకు ఊసూరుమనిపించిందని, మోడీ తెలుగు రాష్ట్రాలను లెక్కలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందుకేనా
కాగా, త్వరలో ఉత్తరప్రదేశ్, కర్నాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి నేతలకు చోటు కల్పించారు. బీహార్లో జెడియూతో ఇటీవలే పొత్తు పొడిచింది. అలాగే, ఓ ఎంపీ రాజీనామా చేశారు. దీంతో అక్కడా ఒకరికి అవకాశమిచ్చారు.