వైసీపీ ఎంపీల రాజీనామా: ఆ ఐదు లోక్సభ స్థానాల ఉపఎన్నికలపై తేల్చేసిన ఈసీ
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో జరగాల్సిన ఉప ఎన్నికలపైనా స్పష్టతనిచ్చింది.వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు.
ఉత్కంఠకు తెర: తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు, 11న ఫలితాలు, షెడ్యూల్ ఇదే
తేల్చేసిన ఈసీ
ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కూడా గడువు లేకపోవడంతో ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదని తెలిపారు.
చట్టంలో స్పష్టంగా ఉంది..
'2019 జూన్ 4వ తేదీతో లోక్సభ పదవీకాలం గడువు ముగుస్తుంది. ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన నియోజకవర్గాలకు కనీసం ఏడాది పాటు అయినా ప్రజాప్రతినిధులు పదవిలో ఉండాలి. ఏడాదిలోపు పదవీ కాలం ఉన్న నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు వీల్లేదని ఎన్నికల చట్టంలో స్పష్టంగా ఉంది' అని రావత్ తెలిపారు.
అందుకే ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు
'ఈ ఏడాది జూన్ 3వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీల రాజీనామాల ఆమోదం జరిగింది. అప్పటి నుంచి లెక్క చూస్తే వచ్చే ఏడాది జూన్ 4వ తేదీకి లోక్సభ పదవీకాలం గడువు ముగుస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు' అని రావత్ స్పష్టం చేశారు.
హోదా కోసం ఎంపీల రాజీనామా
ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీల అమలు, ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల రాజీనామాలను ఈ ఏడాది జూన్ 3న లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు.