ఏపీలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ బంద్...! సుజాతరావు సిఫారసులను ఆమోదించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఈమేరకు ప్రభుత్వ వైద్యుల ప్రైవైట్ ప్రాక్టీసుపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైద్యరంగం ప్రక్షాళనపై నియమించిన సుజాతరావు కమిటి చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. కమిటి సిఫారసు చేసిన 100పైగా సిఫారసులపై సీఎం సుదీర్గంగా చర్చించారు. ఇందులో భాగంగానే పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టిస్ నిషేధం
ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అనేక సంచలన నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్న వైసీపీ ప్రభుత్వం, తాజాగా మరో సంచలన నిర్ణయానికి తెరలేపింది. ప్రజా ఆరోగ్య వ్యవస్తపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనేపథ్యంలోనే వైద్యరంగ సంస్కరణలపై వేసిన సుజాతరావు కమిటీ చేసిన సిఫారసులపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సుధీర్ఘంగా చర్చించారు. ఈమేరకు పలు నిర్ణయాలను ప్రకటించారు. కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో సేవలు అందిస్తున్న వైద్యులు ప్రైవేటు సర్వీసుపై నిషేధం విధించించారు.
దీర్ఘకాలిక వ్యాధులకు 5వేల ఆర్ధిక సహాయం
మరోవైపు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్నట్టుగా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందిపడుతున్న వారికి ప్రతి నెల రూ.5వేలను అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక వెయ్యిరుపాయలు దాటిన ప్రతి వైద్యసేవను ఆరోగ్యశ్రీలో చేర్చి చికిత్స అందించేందుకు అంగీకరించారు. కాగా కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను డిశంబర్ 21 నుండి అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక చెన్నై,బెంగళూరు,హైదరాబాద్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపజేశారు. మరోవైపు 1200 వ్యాధులను అదనంగా ఆరోగ్యశ్రీలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
100పైగా సిఫారసులు చేసిన కమిటీ
సుజాతారావు కమిటి గత రెండు నెలలుగా వైద్య పరిస్థితులపై సమీక్ష జరిపింది. ఈనేపథ్యంలోనే 100 పైగా సిఫారసులను చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వీటిలో డాక్టర్లు, సిబ్బందిని అధిక సంఖ్యలో నియమించడంతో పాటు, వైద్యులకు ఎయిమ్స్ స్థాయిలో జీతాలు పెంచాలని సిఫారసు చేసినట్టు సమాచారం. వీటితో పాటు ఆసుపత్రుల్లో మౌళిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలనే సిఫారలు ఉన్నాయి. ఇక మెడికల్ ఎడ్యుకేషన్లో కూడ పలు సంస్కరణలు చేపట్టాలని కమిటీ సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.