రాయల తెలంగాణ వద్దంటే వద్దు: తెలంగాణ నేతలు
హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని ఢిల్లీలో తెలంగాణకు చెందిన డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెబుతుంటే, ఇక్కడ తెలంగాణ నేతలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణకే తమ పార్టీ అధిష్టానం కట్టుబడి ఉందని, రాయల తెలంగాణపై తమకు సమాచారం లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు.
ఆంధ్రవాళ్ల చేతిలో మరింతగా నష్టపోవడానికే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. యుటిలే అసెంబ్లీలు అవుతున్నాయని, ఇప్పుడు కొత్తగా యుటి ఎందుకని ఆయన అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనపై తాము చర్చించుకున్నామని, సిడబ్ల్యుసి తీర్మానం చేయకముందు అటువంటి ప్రతిపాదన వచ్చి ఉంటే ఆలోచించేవాళ్లమని తాము చెప్పామని ఆయన అన్నారు.
రాయల తెలంగాణ అంశంపై తమకు అధికారికంగా ఏ విధమైన సమాచారం లేదని తెలంగాణకు చెందిన రాష్ట్ర శానససభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణనే తాము కోరుతున్నామని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప తమకు ప్రత్యామ్నాయం అక్కర లేదని ఆయన అన్నారు.
హైదరాబాద్ను యుటిగా చేసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. శాసనసభ ప్రోరోగ్ ఫైలును తాను ఇంకా చూడలేదని, అది చాలా చిన్న విషయమని ఆయన అన్నారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలనే ప్రతిపాదిన వస్తే అప్పుడు అలోచిస్తామని ఆయన అన్నారు. తమకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే కావాలని తెలంగాణకు చెందిన మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
తెలంగాణ ప్రజలు 57 ఏళ్ల నుంచి తమ ఆకాంక్షను చెబుతున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. 1969 నుంచి ఉద్యమం జరిగిన ప్రతిసారీ ఏదో ఒకటి చెబుకుంటూ వస్తున్నారని ఆయన ఒడిషాలో అన్నారు. మెజారిటీ ప్రజల ఆమోదం కష్టమని తెలిసే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాందీ విభజన నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ సంస్కృతి వేరు రాయలసీమ సంస్కృతి వేరని కాంగ్రెసు సీనియర్ నేత ఎం. సత్యనారాయణ రావు అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గడబిడ చేసేదంతా రాయలసీమవారేనని అంటూ వారితో కలవాలంటే ఎలా అని ఆయన అడిగారు. సిడబ్ల్యుసి తీర్మానం ప్రకారం పది జిల్లాలతో కూడిన తెలంగాణనే ఏర్పడుతుందని, రాయల తెలంగాణ ప్రసక్తి లేదని ఖమ్మం జిల్లాలో కాంగ్రెసు నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు.