సుప్రీంలోనూ జగన్ కు షాక్:ఎన్నికల సంఘానికి అనుకూలంగా: కోడ్ విషయంలో మాత్రం..!
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేది ఎన్నికల సంఘం నిర్ణయాధికారమని స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేసామంటూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఉన్నత న్యాయ స్థానం సమర్ధించింది. అయితే, ఎన్నికలు వాయిదా వేసిన ఆరు వారాల పాటు కోడ్ అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం కోర్టు తోసిపుచ్చింది. కోడ్ ను ఎత్తివేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పైన విచారించిన బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
ప్రభుత్వానికి షాకింగ్..ఏం చేయనుది..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను అనూహ్యంగా వాయిదా వేయటం పైన ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం అటు హైకోర్టు..ఇటు సుప్రీం కోర్టులోనూ పిటీషన్లు దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ లో పలు అంశాలను ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరమే ఎన్నికలు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు గతంలో కిషన్సింగ్ తోమర్ కేసులో ఇచ్చిన తీర్పును రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉల్లంఘించిందని ఏపీ ప్రభుత్వం న్యాయవాది వాదించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ఇ, 243యు లో నిర్ధేశించిన మేరకు మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక సంఘాల కాలపరిమితి ముగిసినందున ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ప్రతివాది దీనిని గౌరవించలేదని కోర్టుకు నివేదించారు. మార్చి 31లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తికాని పక్షంలో 14వ ఆర్థిక సంఘం నిధులకు కాలం చెల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
కోవిడ్-19 పరిస్థితిని కూడా కోర్టు ముందుకు
రాష్ట్ర రోజువారీ పాలనలో మాత్రమే కాకుండా కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడంలో స్థానిక సంస్థల పాత్ర కీలకమని పిటిషన్లో పేర్కొంది. మార్చి 15న ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరింది. అయితే, కోర్టు మాత్రం ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్ధిస్తూ.. ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేది ఎన్నికల సంఘం నిర్ణయమేనని తేల్చి చెప్పింది. దీంతో..ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
Recommended Video
కోడ్ ఎత్తివేత..కానీ అనుమతి తీసుకోవాలి..
స్థానిక సంస్థలను అనూహ్యంగా వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పైన జగన్ ప్రభుత్వం సీరియస్ అయింది. దీని పైన అటు హైకోర్టు..ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ప్రభుత్వం అంచనాలకు భిన్నంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల వాయిదాని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించటంతో పాటుగా.. ఆరు వారాల తర్వాత కూడా పరిస్తితిపై సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఈసి కి అప్పగించింది. కోడ్ మాత్రం ఎత్తివేయాలని ఆదేశిస్తూనే..కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలంటే మాత్రం ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘం నిర్ణయించిన విధంగా ఆరు వారాలు నిలిచిపోయినట్లే. ఇక, ఆ తరువాత కరోనా పరిస్థితి పైన ఎన్నికల సంఘం సమీక్షించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం ఆదేశించిన విధంగా అధికారుల పైన చర్యల విషయంలోనూ అమలు చేసే అంశం పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.