కేంద్ర కేబినెట్: ఏపీకి గుండుసున్నా! ఉత్తరాదికే పెద్దపీట! దక్షిణాదిపైనా చిన్నచూపే
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్లో అనూహ్య పరిణామాలు కనిపించాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి కారణమైన హిందీ పాలిత రాష్ట్రాలకే కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత లభించింది. కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాలకు ఆశించిన స్థాయిలో అందలం దక్కలేదు. మన రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్లో ఒక్కరికీ చోటు కల్పించలేదు.
రాష్ట్రం నుంచి లోక్సభకు ఒక్కరు కూడా గెలుపొందలేకపోవడం వల్లే ఏపీకి ప్రాతినిథ్యం కల్పించలేదని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే- ఒక్క స్థానాన్ని కూడా గెలవని కేరళకు కేంద్ర మంత్రివర్గంలో ఒక బెర్త్ కల్పించారు. తమిళనాడులోనూ అదే పరిస్థితి. ఒకటి, రెండు సీట్లకే పరిమితం చేసిన తమిళనాడు నుంచి కేబినెట్లో పదవీ విరమణ చేసిన బ్యురోక్రాట్కు స్థానం దక్కింది.
దక్షిణాదిన కన్నడిగులు..టాప్లో యూపీ
తెలంగాణ, తమిళనాడు, కేరళ నుంచి ఒక్కొక్కరికి బెర్త్ ఖాయం చేశారు. 26 మంది లోక్సభ సభ్యులను అందించిన కర్ణాటక నుంచి ముగ్గురికి మంత్రి పదవులు కట్టబెట్టింది బీజేపీ అగ్ర నాయకత్వం. కేబినెట్లో ఉత్తర్ప్రదేశ్కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నరేంద్ర మోడీ సహా 11 మంది ఆ రాష్ట్రం నుంచి కేబినెట్కు ఎంపిక అయ్యారు. మహారాష్ట్ర, బిహార్ల నుంచి ఆరుమంది చొప్పున కేబినెట్లోకి తీసుకున్నారు.
రాష్ట్రాలవారీగా..
మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ల నుంచి ముగ్గురు చొప్పున నాయకులకు చోటు దక్కింది. హర్యానా, ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు, గోవా, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, అస్సాంల నుంచి ఒక్కొక్కరికి కేబినెట్లో బెర్త్ దక్కింది. తమిళనాడు, ఏపీల నుంచి ఎవ్వర్నీ తీసుకోలేదు. తమిళనాడు కోటా కింద సుబ్రహ్మణ్యం జైశంకర్కు స్థానం కల్పించారు. దీనితో ఆ రాష్ట్రానికి కూడా ప్రాతినిథ్యం లభించినట్టయింది. ఒక్క ఏపీకి మాత్రమే ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని స్పష్టమైంది.
తెలంగాణకు చోటు..
2014లో బీజేపీ నుంచి ఎన్నికైన లోక్సభ సభ్యులకు బెర్త్ దక్కలేదు. అయినప్పటికీ.. తెలుగుదేశంతో పొత్తు ఉన్న కారణంగా- ఆ పార్టీకి చెందిన అశోక గజపతి రాజుకు కేబినెట్ మంత్రిని చేసింది ఎన్డీఏ-1 ప్రభుత్వం. ఆయనతో పాటు సుజనా చౌదరిని సహాయమంత్రి హోదా కట్టబెట్టింది. దీనితో మన రాష్ట్రానికి ప్రాతినిథ్యం లభించినట్టయింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తరువాత ప్రాతినిథ్యం లేకుండా పోయింది. తాజాగా కూడా ఎవ్వరికీ చోటు కల్పించలేదు. తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయను తీసుకున్నప్పటికీ.. వయోభారం రీత్యా ఆయనను మధ్యలోనే తప్పించారు. ప్రస్తుతం ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి తీసుకున్నారు.
గతం ఘనం..
అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆశించిన స్థాయిలో బెర్త్లు దక్కేవి. బండారు దత్తాత్రేయ, కృష్ణంరాజు, ఎన్వీఎస్ఎస్ వర్మలు వాజ్పేయి ప్రభుత్వంలో కీలక శాఖల్లో పని చేశారు. ఈ సారి కేంద్రమంత్రివర్గంలో మన రాష్ట్రానికి చెందిన ఏ ఒక్కర్ని కూడా తీసుకోలేదు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చని తెలుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏపీలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఏర్పడినందున ఇప్పట్లో ఏ ఒక్కరికి కేబినెట్లో చోటు కల్పించినా రాజకీయ సమీకరణాల్లో తేడాలు వస్తాయనే భావనలో బీజేపీ ఉండి వచ్చని అంటున్నారు.
జీవీఎల్ పేరు వినిపించినా..
ప్రస్తుతం మన రాష్ట్రం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు మాత్రమే. ఆయన ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యారు. మొదట్లో ఆయన పేరు వినిపించినప్పటికీ.. దాన్ని కొట్టి పడేసింది బీజేపీ నాయకత్వం. ఆ తరువాత ఆ స్థాయి నాయకులు ఎవరూ లేరని బీజేపీ భావించినట్టుంది. కన్నా లక్ష్మీనారాయణ, హరిబాబు, పురంధేశ్వరి, పైడికొండాల మాణిక్యాల రావు వంటి నాయకులు ఉన్నప్పటికీ.. వారిలో ఏ ఒక్కరి పేరును కూడా పరిశీలనలోకి తీసుకోలేదు.