అప్పుడు హ్యాపీ- ఇప్పుడు అన్ హ్యాపీ- ఏడాదిలో తలకిందులైన అమరావతి పరిస్ధితులు..
ఏపీ రాజధాని అమరావతిలోని మధ్యతరగతి ప్రజలకు అదో కలల ప్రాజెక్టు. తమ కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టేందుకు సులభమైన మార్గం. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు జనం ఎగబడ్డారు. దీంతో ఫ్లాట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ప్రభుత్వం హ్యాపీ, జనం హ్యాపీ.. కానీ ఏడాది తిరిగేసరికి ఇప్పుడు ఎవరిని కదిపినా అన్ హ్యాపీ అన్న మాటే వినిపిస్తోంది.
అమరావతి రైతు దీక్షలకు 150 రోజులు: జయహో అంటోన్న నారా లోకేష్: జగన్కు సలహా
12 టవర్లు.. 1200 అపార్ట్మెంట్లు...
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు పురుడు పోసుకుంది. ఇందులో భాగంగా 274 చ.కి.మీ విస్తీర్ణంలో 12 టవర్లలో 1200 అపార్ట్ మెంట్లు నిర్మించాలని నిర్ణయించారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టు మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను తీర్చే విధంగా అందుబాటైన ధరల్లో ఉండటంతో జనం ఎగబడ్డారు. ఫ్లాట్ల వేలం ప్రారంభించగానే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో ప్రభుత్వానికీ కోట్ల రూపాయల ఆదాయం వచ్చిపడింది. దీంతో నిర్మాణానికి టెండర్లు పిలిచి కాంట్రాక్టు కూడా అప్పగించారు. సరిగ్గా పనులు మొదలయ్యే సమయానికి సీన్ మారిపోయింది.
వైసీపీ సర్కార్ రివర్స్ టెండరింగ్...
గతేడాది వైసీపీ సర్కారు అదికారంలోకి వచ్చాక పురపాలకశాఖ హ్యాపీనెస్ట్ అపార్ట్ మెంట్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ ప్రకటించింది. అప్పటికే ఇచ్చిన కాంట్రాక్టు రద్దు చేసి కొత్తగా అంత కంటే తక్కువగా వచ్చే వారికి పనులు అప్పగించేందుకు సిద్ధమైంది. అంతవరకూ బాగానే ఉన్నా.. కొత్తగా కాంట్రాక్టు వేలంలో పాల్గొనేందుకు బిడ్డర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఓసారి టెండర్లు పిలిచినా స్పందన లేక కొత్తగా మరోసారి టెండర్లు ఆహ్వానిస్తోంది.
హ్యాపీ అన్ హ్యాపీ అయ్యిందిలా...
ఒకప్పుడు అమరావతి ప్రజలనే కాదు ఇతర జిల్లాల వారీనీ ఆకర్షించిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పరిస్దితి తలకిందులు కావడం వెనుక చాలా కారణాలున్నా ప్రధానంగా రాజధాని తరలింపు దీని ఉసురు పోస్తోందని తెలుస్తోంది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు పాత కాంట్రాక్టర్ల హవా, స్ధానికంగా తగ్గిపోయిన రియల్ బూమ్ ఇలా మరెన్నో కారణాలు దీనికి స్పందన లేకుండా చేస్తున్నాయని చెప్పవచ్చు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని జగన్ సర్కారు గత డిసెంబర్ లో తీసుకున్న నిర్ణయంతోనే ఇక్కడ బూమ్ ఒక్కసారిగా పడిపోయింది. ఆ తర్వాత హ్యాపీనెస్టే కాదు ఇలాంటి మరెన్నో ప్రాజెక్టు వైపు చూసే నాథుడే లేకుండా పోయాడు.
Recommended Video
అందరికీ అన్ హ్యాపీ ప్రాజెక్టే...!
హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టు విలువ కంటే తక్కువకు ఒప్పుకోవడం అంటే ప్రస్తుత పరిస్ధితుల్లో ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. అసలే రియల్ బూమ్ పడిపోయింది. లాక్ డౌన్ తో కూలీలు కూడా దొరకని పరిస్ధితి. ప్రభుత్వం ఇచ్చిన బేస్ ప్రైస్ కంటే తక్కువకు కాంట్రాక్టు తీసుకున్నా వచ్చే ప్రయోజనం లేదన్నది కాంట్రాక్టర్ల వాదన. మరోవైపు అంత ఖర్చుపెట్టి ఈ ప్లాట్ల నిర్మాణం చేసిన చివరికి గతంలో కొన్న వారు సైతం అమ్ముకునేందుకు సిద్ధమవుతుండటం ప్రభుత్వాన్ని సైతం ఆందోళనలోకి నెడుతోంది. వెరసి ఇది ఇప్పుడు అందరికీ అన్ హ్యాపీ ప్రాజెక్టుగా మారిపోయింది.