కెసిఆర్ జోస్యం: రేణుక, కెసిఆర్ మా అధిష్టానమా: బొత్స
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జోష్యం చెప్పినంత మాత్రాన ఏమి జరగదని, ముందు తమ పార్టీ పని చక్కపెట్టుకోవాలని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. తమ పిల్లలు వేరు సంసారం పెడతామంటే పెద్దలు వద్దంటారు... కానీ అంత మాత్రాన కలిసుండలేరు కదా అని ఆమె అన్నారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచించే అవకాశం లేదని చెప్పారు.
కేసీఆర్ ఏమైనా మా అధిష్టానమా: బొత్స
ముఖ్యమంత్రి మార్పు గురించి చెప్పేందుకు టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఏమైనా తమ అధిష్టానమా అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. 2014 వరకు రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వ మార్పులు జరగవని, అప్పటి వరకు ముఖ్యమంత్రిగా కిరణ్కుమార్రెడ్డే కొనసాగుతారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
రాజీనామాలు చేయవలసి వస్తే అందరం కలిసే చేస్తామని బొత్స అన్నారు. ఆదివారం జరిగిన సకల జనుల భేరీలో అక్టోబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోతారని కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అనాటి పరిస్థితులకు అనుగుణంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పార్టీ పెద్దలకు చెప్పామని, కానీ ప్రస్తుతం పరిస్థితి మారినా దాన్నే ప్రామాణికంగా తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు.
కాగా కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం బొత్స ఢిల్లీ వెళ్ళనున్నారు. ముందుగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ నోట్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.