తస్మాత్ జాగ్రత్త: ఏపీ ప్రభుత్వంలో వ్యక్తిగత సమాచారానికి భద్రత కరువు
మీరు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్నారా... ఆన్లైన్లో మీ ఆస్తిపన్ను, వాటర్ బిల్స్, అడ్వర్టైజ్మెంట్ టాక్స్, కడుతున్నారా... ? అయితే తస్మాత్ జాగ్రత్త. జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వమే మీ వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తోంది. అదికూడా మీరు ఉంటున్న ప్రాంతం సంబంధించిన జీపీఎస్ లొకేషన్తో పాటు ఓటరు లిస్టులో ఉన్న మీ వార్డుతో సహా ప్రభుత్వం ప్రచురిస్తోంది.
కొత్తగా వెలుగు చూసిన డేటా లీకేజీలో, డేటా సెక్యూరిటీ రీసెర్చర్లు మీరు లక్షల్లో కట్టిన ట్యాక్స్ వివరాలను మీ ఆధార్ నంబర్తో సహా ఏపీ ప్రభుత్వానికి చెందిన emunicipal.ap.gov.in వెబ్సైట్లో ఉంచుతున్నారు. ఇక ఇదే అనుకుంటే మీ వ్యక్తిగత సమాచారం తీసుకెళ్లి మూడో పార్టీకి చెందిన సర్వర్లపై భద్రపరుస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఎవరైనా సరే మీ వ్యక్తిగత సమాచారాన్ని దోపిడీ చేసేందుకు ఆస్కారం ఉందని గ్రహించాలి.
ఏపీ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఇది మొదటి సారి కాదు. అంతకుముందు అన్నాసంజీవని స్టోర్ల నుంచి మెడిసిన్స్ కొనుగోలు చేసినప్పుడు వినియోగదారుల ఫోన్ నెంబర్లు అన్నాసంజీవని వెబ్ పోర్టల్పై దర్శనమివ్వడం విస్మయానికి గురిచేసింది. అంతకుముందు 11వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆధార్ నంబర్లను ఏపీ ప్రభుత్వం వెబ్సైట్ లీక్ చేసింది. సెక్యూరిటీ రీసెర్చర్లు ప్రభుత్వ దృష్టికి తీసుకురాగానే ఎండోమెంట్ అధికారులు వెబ్సైట్ను నిలిపివేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.
ఐటీ విప్లవం తీసుకొస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతూనే ఇలాంటి లీకులకు పాల్పడటం ఏమిటని పౌరులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాచారానికి భద్రత లేదని వారు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సమాచారం థర్డ్ పార్టీ వెబ్సైట్పై దర్శనమివ్వడం ఆందోళన కలిగిస్తోందని డేటా సెక్యూరిటీ రీసెర్చర్ శ్రీనివాస్ కొడాలి అన్నారు. డేటా ఉన్న థర్డ్ పార్టీ సర్వర్ ఒక ఎన్జీఓ సంస్థ. దీనికి సంబంధించి శ్రీనివాస్ కొడాలి ట్విటర్లో పోస్టు చేయగా అక్కడా కూడా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.