కేటీఆర్-జగన్ భేటీ కలకలం: సోషల్ మీడియాలో అభిమానుల యుద్ధభేరి
ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు మరో మూడునెలల సమయం ఉండగానే అక్కడ పార్టీల మధ్య వార్ పీక్ స్టేజెస్కు చేరుకుంది. పార్టీల అధినేతల మధ్య యుద్ధం కంటే వారిని అభిమానిస్తున్న అభిమానుల మధ్య వార్ ముదురుతోంది. అయితే ఇది ప్రత్యక్ష యుద్ధం కాదు.. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న యుద్ధభేరి. ఈ మాటల యుద్దానికి వేదికగా నిలుస్తున్నాయి ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్లాంటి సామాజిక మాధ్యమాలు.
ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టించిన కేటీఆర్ జగన్ భేటీ
తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి.. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు అందరి దృష్టి ఏపీ రాజకీయాలపై పడింది. ఓ వైపు టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు వైసీపీ అధినేత ప్రతిపక్షనేత జగన్, ఇంకోవైపు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీలు బరిలో నిలుస్తుండటంతో ఏపీ రాజకీయాలు కాకమీద ఉన్నాయి. చంద్రబాబు కాంగ్రెస్తో కలవడం, వైసీపీ అధినేత జగన్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవడం, జనసేన పార్టీ టీడీపీతో కలిసి వెళుతుంది అని పుకార్లు రావడంతో ఏపీ పాలటిక్స్ హీట్ను క్రియేట్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు ముగ్గురు ఒక చోట చేరిన చర్చించుకుంటున్న విషయం ఏపీ రాజకీయాలే కావడం విశేషం.
సోషల్ మీడియా వేదికగా అభిమానుల యుద్ధం
ఇక పార్టీల అధినేతల పోరు ఎలా ఉన్నప్పటికీ... అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధానికి దిగుతున్నారు. మా పార్టీ గొప్పది మా నాయకుడు గొప్పవాడు అంటే మా లీడరే గొప్పవాడంటూ యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా కేటీఆర్ జగన్ల భేటీ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా తమతో కలిసి రావాలని కేసీఆర్ దూతగా కేటీఆర్ జగన్ నివాసానికి వెళ్లి కోరడం జరిగింది. ఈ భేటీని టీడీపీ జనసేన అభిమానులు ఒక రకంగా చూస్తుండగా వారికి వైసీపీ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఒకప్పుడు జగన్ను తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు అదే జగన్తో ఎలా కలుస్తారని టీడీపీ అభిమానులు ప్రశ్నిస్తుండగా... చంద్రబాబు కాంగ్రెస్తో కలిసినప్పుడు తప్పుగా అనిపించని మీకు ఈ భేటీ మాత్రం తప్పుగా కనిపిస్తోందా అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. ఒకప్పుడు సోనియాను రాక్షసిగా అభివర్ణించిన చంద్రబాబు అదే సోనియాను దేవతగా పూజిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
హరికృష్ణ మృతదేహం దగ్గర చంద్రబాబు రాజకీయాలు మాట్లాడారు: వైసీపీ
దివంగత నేత హరికృష్ణ మృదేహాన్ని పక్కనే పెట్టుకుని చంద్రబాబు కేటీఆర్తో రాజకీయాలు మాట్లాడారని ఆ విషయం స్వయంగా కేటీఆర్ చెప్పారని వైసీపీ అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ ఒప్పుకుని ఉంటే చంద్రబాబు తెలంగాణలో టీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధపడేవారు కాదా అని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్తో సమావేశం అవడాన్ని ఏపీలో జగన్ కొత్త జగన్నాటకానికి తెరతీశారని టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండగా... చంద్రబాబు రాహుల్ నివాసానికి వెళ్లి కలిశారని .. కేటీఆర్ జగన్ నివాసానికి వెళ్లి కలిశారని అది జగన్కున్న స్టామినా అంటూ వైసీపీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అయినా మోడీతో నాలుగేళ్లు కాపురం చేసి ఇప్పుడు జగన్ మరొకరితో వెళితే ఎందుకు అంత కడుపు మంట అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
పొత్తుపై పవన్ ఖండించినప్పటికీ ఆగని మాటల యుద్ధం
ఈ మధ్యే పవన్ కళ్యాణ్తో కలిసి వెళితే జగన్కు ఎందుకంత కడుపుమంట అన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. అయితే ఈ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ ఖండించారు కూడా.. కానీ అభిమానుల మధ్య మాత్రం వార్ జరుగుతూనే ఉంది. పవన్ టీడీపీతో పొత్తు దిశగా వెళుతున్నారనేందుకు చంద్రబాబు వ్యాఖ్యలే నిదర్శనం అంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ఎత్తి పొడుస్తున్నారు. అంతే స్థాయిలో జనసేన అభిమానులు కూడా కౌంటర్ అటాక్ ఇస్తూ వస్తున్నారు. కేటీఆర్ జగన్ భేటీపై కూడా జనసేన అభిమానులు కామెంట్ చేసిన నేపథ్యంలో 2014లో కేసీఆర్ను పవన్ తాట తీస్తానన్నారని... కేసీఆర్ కూడా పవన్ కళ్యాణ్ వరంగల్ వేదికగా దూషించారని గుర్తు చేసిన వైసీపీ అభిమానులు... ఆ తర్వాత కేసీఆర్ను ప్రగతి భవన్కు వెళ్లి పవన్ ఎలా కలిశారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శతృవులు ఉండరనేదానికి ఇది నిదర్శనం అని చెబుతున్నారు.
నేతలు బాగానే ఉన్నారు.. అభిమానులు నష్టపోతున్నారు: రాజకీయ విశ్లేషకులు
నేతలు బాగానే ఉన్నారు... ఎవరి లెక్కలు వారికున్నాయి. పొద్దున్నే లేసి ఒకరినొకరు విమర్శించుకుంటారు దూషణలకు దిగుతారు, కానీ ఒక సమయం వస్తే భాయీ భాయీ అన్న రీతిలో వ్యవహరిస్తారు. అప్పుడు వారన్న మాటలు వారు వాడిన పద ప్రయోగాలు ఎవరికీ గుర్తుకు రావు. చిరునవ్వుతోనే పలకరించుకుంటారు. ఇవన్నీ రాజకీయాల్లో కామన్ అని ఎటొచ్చి సోషల్ మీడియా వేదికగా అభిమానులు కత్తులు దూసుకోవడం సరికాదని... రాజీకీయాలను ఆస్వాదించాలే తప్ప... వ్యక్తిగత దూషణలకు దిగరాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకాలం ఒకరినొకరు తిట్టుకున్నప్పటికీ రేపు కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా రెండు పార్టీలు కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాంటి సమయంలో అప్పటి వరకు ఉన్న పరిస్థితుల కారణంగా మాటల యుద్దానికి దిగిన అభిమానులు అధినేతలు కలిస్తే ఏమని సమాధానం చెప్పుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. నేతలు ఎప్పుడూ బాగానే ఉంటారని వారిని నమ్ముకున్న అభిమానులే నష్టపోతారని వారు చెబుతున్నారు. ఇలాంటి సోషల్ మీడియా వార్కు స్వస్తి చెప్పాలని పొలిటికల్ అనలిస్టులు హితవు పలుకుతున్నారు.