హోదా సాధ్యం కాదు, చంద్రబాబూ! సంతకమెలా పెట్టావు: టీడీపీకి రాజ్నాథ్ ఝలక్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం పునరుద్ఘాటించారు. రూ.2.06 లక్షల కోట్లకు పైగా ప్యాకేజీ ఇస్తున్నామని, ఇంకేం కావాలని చెప్పారు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా, దానికి సమానంగా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
'కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడిపోయిన చంద్రబాబు, మోడీకి అడ్డులేదు'
ప్రత్యేక ప్యాకేజీ పైన సంతకం పెట్టి, ఆ తర్వాత ఎందుకు మాట మార్చారో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కేంద్రమంత్రి ప్రశ్నించారు. ప్యాకేజీపై సంతకం పెట్టడాన్ని నిలదీయడం ద్వారా తెలుగుదేశం పార్టీని ఆయన కార్నర్ చేసే ప్రయత్నాలు చేశారు.
సెంటిమెంట్ పేరుతో ధర్నాలు, దీక్షలు సరికాదు
ప్రత్యేక హోదా పేరుతో సెంటిమెంట్ రేపి, దానిని అడ్డు పెట్టుకొని, ధర్నాలు, దీక్షలు చేయడం సరికాదని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నవ్యాంధ్ర ప్రదేశ్లో ఎవరితో పొత్తు ఉన్నా, లేకున్నా రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు. ఏపీని అభివృద్ధి చేస్తామన్నారు.
రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు
చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా పైన యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నూరు శాతం నిధులు ఇస్తున్నామని చెప్పారు. ఏపీకి ఎనిమిది బెటాలియన్లు మంజూరు చేశామన్నారు. అది రాష్ట్ర అభివృద్ధి పట్ల తమ నిబద్ధత అన్నారు. బీజేపీకి ఉన్న కార్యకర్తలు దేశంలో ఏ పార్టీకీ లేరన్నారు. దేశంలో మూడింట రెండొంతుల భూభాగంపై తమ పార్టీ అధికారంలో ఉందన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 2014లో బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంకల్పాలు తీసుకున్నామని, కూటమి మిత్ర ధర్మం పాటించేందుకు బీజేపీ పూర్తిస్థాయిలో కృషి చేసిందన్నారు.
టిట్లి తుఫాను బాధితుల్ని ఆదుకుంటాం
శ్రీకాకుళం జిల్లాలో వచ్చిన తుఫానుపై రాజ్నాథ్ స్పందించారు. టిట్లీ బాధిత ప్రాంతాలను, ప్రజలను ఆదుకుంటామని చెప్పారు. నష్టానికి సంబంధించిన అంచనాలు ఇస్తే ఆదుకుంటామని తెలిపారు.
నక్సలిజంపై ఏపీకి అండగా ఉంటాం
నక్సలైట్ల కారణంగా ఇద్దరు ప్రజాప్రతినిధులను కోల్పోయామని రాజ్నాథ్ చెప్పారు. ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యలు చాలా బాధాకరం అన్నారు. నక్సలిజం అణిచివేతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా ఉంటామని చెప్పారు.