హోదా: బీజేపీ నేతలకి తేల్చిచెప్పిన సిద్ధార్థ్, 'టీడీపీ ప్రభుత్వాన్ని వదలొద్దు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతల పైన ఆ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు సిద్దార్థనాథ్ సింగ్ శుక్రవారం నాడు బాంబు వేశారు! ఈ రోజు ఉదయం విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా సిద్దార్థనాథ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై సూటిగా చెప్పేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇవ్వలేమని తేల్చి చెప్పినట్లుగా సమాచారం. ఇప్పటికే కేంద్రమంత్రులు హెచ్పీ చౌదరి, అరుణ్ జైట్లీ తదితరులు దీనిపై పార్లమెంటులోనే తేల్చేశారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రాలను ఒప్పించి ఇచ్చే పరిస్థితుల పైన చాలామంది ఆశలు పెట్టుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి నేతలు, ఏపీ బీజేపీ నేతలు కూడా వచ్చే ఎన్నికల నాటికి ఇచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమనే అభిప్రాయాలతో ఉన్నారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్దార్థనాథ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు లేవని తేల్చి చెప్పారని తెలుస్తోంది. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా కంటే ఎక్కువ చేయాలని కేంద్రం చూస్తోందని చెప్పారు. హోదా కంటే ఏపీకి ఎక్కువ మేలు చేస్తామని చెప్పారు. దీనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఏపీ బీజేపీ నేతలకు సూచించారు. ఏపీకి కేంద్రం అన్ని పనులను చేస్తుందన్నారు.
మనం చేసిందే చెబుతామని నేతలకు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నేతలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ చేసే విమర్శలపై గట్టిగా స్పందించాలని సూచించారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను కేంద్రంపై రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షులు హరిబాబు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
చట్టంలో రెవెన్యూ లోటు లేకున్నా: సిద్ధార్థనాథ్ సింగ్
చట్టంలో లేకున్నప్పటికీ తాము ఏపీ రెవెన్యూ లోటును భర్తీ చేస్తున్నామని బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పారు. రాజకీయ కారణాల వల్లనే కొందరు తమ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కంటే తాము ఎక్కువే చేస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అదనపు సాయం కోరుతున్నారని, చేస్తామన్నారు. తమపై తప్పుడు ఆరోపణలు సరికాదన్నారు.
ధర్నాలు చేస్తే రైల్వే జోన్ వస్తుందా?
విశాఖపట్నం నగరానికి రైల్వే జోన్ ప్రకటించాలంటే, అందుకు కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయని ఏపీ అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఎవరో వచ్చి ధర్నాలు చేసినంత మాత్రాన నిబంధనలకు విరుద్ధంగా కేంద్రం రైల్వే జోన్ను ప్రకటించే అవకాశాలు లేవన్నారు.
అయితే, విభజన చట్టంలో జోన్ ప్రస్తావన ఉన్నందున తామంతా జోన్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ అందుకున్న నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.తీసుకున్న డబ్బుకు లెక్కలు చెప్పాలన్నారు.