ఇలాంటి శాసనసభ మాకొద్దు ! నేటి సమావేశాలను బహిష్కరించిన టీడిపి !!
అమరావతి/హైదరాబాద్ : ఏపి శాసన సభలో యుద్ద వాతావరణం కనిపిస్తోంది. ఆరోపణలు. ప్రత్యారోపణలతో శాసన సభ సమావేశాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. కొన్ని సందర్బాల్లో నేతల వ్యవహారం శృతి మించుతున్నట్టు తెలుస్తోంది. వైసిపి ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి సభలో ప్రతిపక్ష పార్టీ నిలదీస్తుంటే, గత పాలనలో టీడిపి చేసిన తప్పిదాల గురించి వైసీపి ఏకరువుపెడుతోంది. ఈ రెండు వాదనల మద్య సభలో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంటోంది.
కొన్ని సందర్బాల్లో సభ్యులు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ వ్యక్తిగత దూషణలకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, సభా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మద్య వాడి వేడి చర్చ జరుగుతోంది. సభలో చంద్రబాబుకు ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు టీడిపి అసమనం వ్యక్తం చేస్తోంది. అంతే కాకుండా నేడు శాసన సభను పూర్తిగా బహిష్కరించాలని నిర్ణయించింది.
కాగా శాసనసభ సమావేశాలను ఈ రోజు మొత్తం బహిష్కరించాలని టీడిపి నిర్ణయించింది. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడటానికి అవకాశమివ్వనందుకు నిరససనగానే నేటి సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని టీడిపి సభ్యులు వాకౌట్ చేశారు. రైతు సమస్యలు, పెట్టుబడి సాయంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మైక్ ఇవ్వాలంటూ సభలో నినాదాలు చేసిన సభ్యులు అనంతరం సభ నుంచి బయటకు వెళ్లారు.
అంతకుముందు ఇవాళ అసెంబ్లీ ప్రారంభానికి ముందే సభాహక్కులు కాపాడాలంటూ శాసనసభ ప్రధాన ద్వారం వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. టీడిపి అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సహా పార్టీ శాసనసభ్యులందరూ ఆందోళనలో పాల్గొన్నారు. టీడిపి శాసనసభ ఉపనేతలపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు