భద్రాచలం ఏపీకా.. ఎవరన్నారు .. ప్రతిపాదనేమీ లేదే అన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Recommended Video
తెలంగాణా దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భద్రాచలంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం ఎపీకి ఇవ్వాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్దలేదనీ భద్రాద్రి ఎపీకి ఇచ్చే విషయాన్ని కొట్టి పారేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల అభివృద్ధికి కలిసి పని చేస్తారని ఆయన పేర్కొన్నారు.
భద్రాచలం ఏపీదని చంద్రబాబు రేపిన రగడ .. నేటికీ తెలుగు రాష్ట్రాల్లో చర్చ
తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందా? లేక ఆంధ్రప్రదేశ్ కు భద్రాచలాన్ని సీఎం కేసీఆర్ ఇవ్వనున్నారా అన్న చర్చకు గత ఎన్నికల సమయంలో బీజం పడింది. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునిగిపోతుందని, వెంటనే ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని తెలంగాణ సర్కార్ కోర్టుకెళ్లింది . ఇక దీనిపై చంద్రబాబు నాయుడు భద్రాచలం కూడా మాదే మాకు ఇచ్చేయండి అంటూ ఎన్నికల ప్రచారంలో మండిపడ్డారు. ఎన్నికలు ముగిసి టిడిపి అధికారాన్ని కోల్పోయినప్పటికీ భద్రాచలం టాపిక్ మాత్రం ఇంకా తెలుగు రాష్ట్రాల్లో నడుస్తూనే ఉంది. అందుకు కారణము లేకపోలేదు.
భద్రాచలం విలీనానికి తెలంగాణా సీఎం సుముఖంగా ఉన్నారని ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలాన్ని త్వరలోనే ఏపీ లో విలీనం చేయనున్నారనే ప్రచారం ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. అయితే దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్టు, కెసిఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు ప్రచారం జరిగింది . ఇటీవల రాజ్భవన్లో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ సమావేశమైనప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. విభజన చట్టం అంశాలు, రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారంపై చర్చ సందర్భంగా భద్రాద్రి విలీనాంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని టాక్ వినిపిస్తోంది . భద్రాద్రిని ఏపీలో కలిపేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాథమికంగా సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇందుకు సముఖంగా ఉంటే భద్రాచలం విలీనం పెద్ద సమస్య కాదనేది రాజకీయ విశ్లేషకుల భావన.
భద్రాచలం ఏపీకా .. అలాంటి ప్రతిపాదన ఏమీ లేదే అన్న తెలంగాణా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఇదే విషయంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచల పుణ్యక్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్కు అప్పగించే అవకాశం ఉందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. భద్రాచలాన్ని ఏపీకి ఇస్తున్నామని మీకెవరు చెప్పారు అంటూ తిరిగి ప్రశ్నించారు .అటువంటి ప్రతిపాదన ఏదీ తెలంగాణ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు.
తూర్పుగోదావరి, ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉన్న చారిత్రక పుణ్యక్షేత్రం అయిన భద్రాచలాన్ని ఏపీకి అప్పగిస్తారన్న వార్తలు గత కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. పోలవరం పరిధిలో 7 మండలాలు ఏపీ లో విలీనం చేసిన క్రమంలో భద్రాచలం కూడా ఏపీ లో విలీనం అవుతుందని అందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చర్చ జరుగుతున్న వేళ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.