మున్సిపాలిటీల్లో పన్నులు పెంచం...పందులకు హాస్టల్స్:మంత్రి నారాయణ
అమరావతి:ఇప్పట్లో మున్సిపాలిటీల్లో పన్నులు పెంచబోమని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ హామీ ఇచ్చారు. విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్లో నగర పంచాయ తీలు, గ్రేడ్-3 మున్సిపాలిటీల చైర్పర్సన్లు, ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పంచాయతీలు, గ్రేడ్- 3 మున్సిపాలిటీల ఆదాయం రాక చాలా తక్కువగా ఉందన్నారు. కానీ అక్కడ చేయాల్సిన పనులు మాత్రం ఎక్కువగా ఉన్నాయన్నారు. పంచాయతీలకు నరేగా నిధుల తో పనులు చేయించుకునే వీలుందని, అయితే మున్సిపాలిటీలకు అటువంటి అవకాశం లేదన్నారు. మున్సిపాలిటీల పరిధి విస్తరణ వల్ల ఆయా పరిధిలోని నివాసులందరికీ నీటి సదుపాయంతో పాటు, రోడ్లు నిర్మించాల్సి వస్తోందన్నారు.
ఆ క్రమంలో ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు గాను రూ.12,500 కోట్లు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఆ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని సిఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం మేరకు గ్రేడ్- 3 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సెప్టెంబర్ 10 లోగా మిగతా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
2019 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పారు. అలాగే వివిధ ప్రదేశాల్లో పందుల హాస్టల్స్ నిర్మాణం చేపట్టనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అక్టోబర్ కల్లా ఆరు లక్షల మంచినీటి కుళాయి కనెక్షన్లు అందుబాటులోకి తీసుకురావాలని అధి కారులను ఆదేశించారు. బిపిఎల్ కుటుంబాలకు రూ. 200 కే కనెక్షన్ అందిస్తామన్నారు.
అలాగే అమృత్ పథకం కింద 33 నగరాలలో మౌలిక సదుపాయాల కల్పనకు గాను ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ బ్యాంక్ రూ. 3375 కోట్లు నిధులు కేటాయించిందని మంత్రి నారాయణ వెల్లడించారు. త్వరలోనే దీనికి టెండర్లు ఖరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు.