నగరిలో ఈసారి రోజాకు నో టికెట్! ఫైర్ బ్రాండ్ను వద్దంటున్న సొంత పార్టీ నేతలు!!
'రేయ్..రేయ్.. వెన్నుపోటు దారుడు ఎక్కడో ఉండడు.. నీ పక్కనే ఉంటాడు' అని అరుణాచలం సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు రోజా రాజకీయ ప్రస్ధానానికి అతికినట్టు సరిపోతోంది. చిత్తూరు జిల్లాలో సొంత పార్టీ నేతలే వచ్చే ఎన్నికలో రోజాకు నగరి సీటు దక్కకుండా మోకాలు అడ్డుపెడుతున్నట్టు తెలుస్తోంది. జబర్దస్త్ పేరుతో రోజా నగరి నియోజక వర్గ ప్రజలను పట్టించుకోవడం లేదనే ప్రధాన కారణాన్ని వైసీపి అదినేత జగన్ కు చెప్పేందుకు చిత్తూరు వైసిపి నాయకత్వం పాంవులు కదుపుతోంది. దీంతోనగరిలో రోజా ఆశలు ఆవిరవ్వక తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో రోజాకు మళ్లీ టికెట్ ఇవ్వాలని జగన్ భావించినా స్థానిక నాయకత్వం నుండి వచ్చే వ్యతిరేకత ఏ పరిణామానికి దారి తీస్తుందోననే చర్చ జరుగుతోంది. దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరించలేదు అంటే ఇదే మరి..!!
రోజాకు మోకాలు అడ్డుతున్న చిత్తూరు జిల్లా వైసీపి నేతలు..! జబర్ధస్త్ తో స్థానికి ప్రజలకు దూరమైందని ఆరోపణ..!!
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజాకు రానున్న ఎన్నికల్లో సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని అనుకుంటున్నా, ఆమె వ్యతిరేక వర్గం ఆమె మైనస్ పాయింట్లను అవకాశంగా తీసుకుని, సీటు రాకుండా చేయడానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్టు భోగట్టా. ఎమ్మెల్యే రోజా షూటింగ్ల నిమిత్తం ఎక్కువ సమయాన్ని చెన్నై, హైదరాబాద్లలో గడుపుతున్నారని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి వారు ఆరోపణలు చేస్తున్నట్లు తెలిసింది.
నటిగా పాస్ మార్కులు..! ఎమ్మెల్యేగా జీరో మార్కులు అంటున్న స్థానికి నేతలు..!!
ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో లేని సమయంలో నగరి నియోజకవర్గం బాధ్యతలను మాజీ మంత్రి రెడ్డి వారి చెంగారెడ్డి సోదరుడు చక్రపాణి రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. రోజాకు ప్రత్యామ్నాయంగా ఆయన కార్యక్రమాలను చేస్తున్నట్లు నియోజక వర్గంలో పేరు సంపాదించారు. దీంతో ఆయనకే నగరి నియోజకవర్గం సీటు దక్కే అవకాశం ఉందని, దానికి తగిన విధంగా ఆయన పావులు కదుపుతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. నియోజకవర్గం ప్రజలు ఆమెను ఒక నటిగా అభిమానిస్తూ, ఎమ్మెల్యేగా వ్యతిరేకిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక పక్క సినిమాలు..! మరో పక్క జబర్దస్త్..! ఇక ప్రజా సమస్యల పట్ల టైమెక్కడ..?
రోజాకు ఫైర్ బ్రాండ్ అనే పేరు కూడా ఉన్నప్పటికీ, నియోజకవర్గంలో ఎక్కువ కాలం గడపక పోవడంతో ఆమెపై పార్టీలోని కొంత మంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నగరి నియోజకవర్గంత నుంచి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి దివంగతనేత ముద్దు కృష్ణమ నాయుడు కుటుంబం నుంచి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు జగదీష్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆయన సతీమణి, ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయిన సరస్వతి ప్రకటన చేశారు.
ఈ సారి అంత వీజీ కాదు..! గాలి ముద్దు క్రిష్ణమనాయుడు వారసులు ప్రభావం చూపే అవకాశం..!
జగదీష్ కాని, ముద్దుకృష్ణమ నాయుడు మరో కుమారుడు భాను ప్రకాష్ కాని పోటీ చేసినట్లయితే వారికి సానుభూతి ఓట్లు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో నగరి నియోజకవర్గం రానున్న ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటీని ఎదుర్కొనాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ కారణంగా జగన్ మోహన్ రెడ్డి ఈనియోజక వర్గం అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏతావాతా చూస్తుంటే రోజాకు టిక్కెట్టు గండం పొంచివున్నట్లు తెలుస్తోంది.