టిక్కెట్ లేదు కానీ: తేల్చేసిన అంబటి, అన్యాయం చేశారు.. మాట్లాడతా: వంగవీటి ఆగ్రహం
విజయవాడ: వంగవీటి రాధాకృష్ణకు విజయవాడ సెంట్రల్ సీటు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం మరోసారి తేల్చి చెప్పింది. ఈ సీటును మరొకరికి కేటాయించామని, వంగవీటికి ఇవ్వలేమని చెప్పారు. సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు పోటీ చేయనున్నారు. దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడారు.
వంగవీటికి టిక్కెట్ ఇవ్వలేమన్నదే పార్టీ నిర్ణయమని చెప్పారు. పార్టీ ఆదేశాలను అందరూ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గెలుపు ఓటముల ప్రకారమే టిక్కెట్లు కేటాయిస్తారని తెలిపారు. మల్లాది విష్ణు పోటీ చేస్తారని అభిప్రాయపడ్డారు.
పెట్రోల్ బాటిల్తో హంగామా, కార్యకర్తలకు వంగవీటి రాధా హెచ్చరిక: రంగంలోకి నేతలు, జగన్ చెప్పేవరకు..
వంగవీటి ఫ్యామిలీని దూరం చేసుకోమని అంబటి, ఆగ్రహావేశాలు
వంగవీటి కుటుంబాన్ని వైసీపీ దూరం చేసుకోదని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. వంగవీటికి విజయవాడ తూర్పు లేదా బందర్ పార్లమెంటు స్థానం ఇస్తామని చెప్పామని తెలిపారు. ఆయన ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చునని చెప్పారు. అయితే అంబటి వ్యాఖ్యలపై వంగవీటి రాధా అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ తూర్పు సీటును ఇప్పటికే యలమంచిలి రవికి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
నాకు అన్యాయం చేశారు
పార్టీ అధిష్టానంపై వంగవీటి రాధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, అయినా తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రాధా రంగా మిత్రమండలి, తన అనుచరులు తదితరులతో మాట్లాడారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు. విజయవాడ సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకు కేటాయించారనే వార్తలపై రాధా, ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఎవరూ తొందరపడొద్దు
వంగవీటి రాధాకు ఇతర నియోజకవర్గాల టిక్కెట్లు ఇస్తామని వైసీపీ అధిష్టానం చెప్పింది. దీనిపై మాత్రం రంగా తగ్గలేదు. తాను ఇక్కడి నుంచి పోటీ చేసే విషయంలో వెనక్కి తగ్గేది లేదని అనుచరులతో చెబుతున్నారు. ఎవరూ తొందరపడవద్దని అనుచరులకు సూచించారు. ప్రస్తుతానికి మనం పార్టీలోనే ఉన్నామని, అధిష్టానంతో మాట్లాడుదామని చెప్పారు. అధిష్టానంతో మాట్లాడిన తర్వాతే నిర్ణయమన్నారు.
రాధకు టచ్లోకి రాని వైసీపీ ముఖ్య నేతలు
సెంట్రల్ సీటు పైన జిల్లా ముఖ్య నేతలు, ఇతర ముఖ్య నేతలతో మాట్లాడేందుకు వంగవీటి రాధా ప్రయత్నాలు చేయగా టచ్లోకి రాలేదని తెలుస్తోంది. దీంతో రాధా తీవ్రమనస్తాపం చెందారని సమాచారం. ఈ సందర్భంగా రాధ అనుచరులు మాట్లాడుతూ... తామంతా ఆయన వెంటే ఉంటామని చెప్పారు. రాధ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తామని చెప్పారు.