మొదట నుంచి జైట్లీ కరెక్ట్గానే: చంద్రబాబే ప్రజలను తప్పుదారి పట్టించారా?
అమరావతి: 'ఏపీకి అండగా నిలుస్తాం.. విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్కు అన్నీ చేస్తాం' లోక్సభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం అన్న మాటలివి. దీనిని బట్టి ఏపీ ప్రజలకు అర్ధం అయింది ఏమిటంటే కేంద్రం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వబోదని స్పష్టంగా తెలుస్తోంది.
అంతేకాదు విభజన చట్టప్రకారమే అన్నీ చేస్తామంటున్న అరుణ్ జైట్లీ, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయం చట్టంలో లేదని తేల్చేశారు. అంతేకాదు ఏపీని విభజన చేసింది మేం కాదని, యూపీఏ ప్రభుత్వమని అన్నారు. అయినప్పటికీ యూపీఏ ప్రభుత్వం నెరవెర్చని హామీలను కూడా మేం నెరవేరుస్తున్నామనంటూ లోక్సభలో ప్రకటన చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరి ఏంటో స్పష్టం చేశారు. రెవిన్యూ లోటును పూడ్చడానికి తొలి ఏడాది రూ. 2800 కోట్లు ఇచ్చామని, నిజానికి కేంద్రం నిధులు ఇచ్చి సహకరించాలనే నిబంధన ఏదీ లేదని కూడా చెప్పారు. అయితే విభజన చట్ట ప్రకారం ఏపీకి దక్కాల్సిన వాటిని కూడా కేంద్రం ఇవ్వకపోవడం విశేషం.
2014లో ఎన్టీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ మంత్రులు, పెద్దలు ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు సుముఖంగా లేరనే చెప్పాలి. ఏనాడూ వాళ్లు ప్రత్యేకహోదాకు అనుకూలంగా ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో ఎప్పుడు మాట్లాడిని విభజన చట్ట ప్రకారమే నెరవేరుస్తామనే చెప్పారు.
అయితే ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు తప్పుదారి పట్టించారా? అనే వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అరుణ్ జైట్లీ తాజా వ్యాఖ్యలతో ఏపీలో బీజేపీ పుంజుకోవడం కూడా కష్టమే.
విభజన చట్టంలో ఏపీకి రైల్వే జోన్ కేటాయించాలని ఉంది. ప్రస్తుతం ఆ రైల్వే జోన్ను విశాఖకు కేటాయించాలని గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ రైల్వే జోన్ విషయంలో కూడా కేంద్రం ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు.
విశాఖకు రైల్వే జోన్ కేటాయంచడం వల్ల ఏపీకి అదనపు ప్రయోజనాలు ఉంటాయే తప్ప.. కేంద్రానికి పోయేదేమీ ఉండదు. దాన్ని ఇవ్వడానికి కూడా కేంద్రం నో చెప్పింది. ప్రస్తుతం నవ్యాంధ్ర నూతన రాజధానిగా వెలుగొందుతున్న విజయవాడ నుంచి విశాఖ మీదుగా న్యూఢిల్లీకి రాజధాని ఎక్స్ప్రెస్ను కొత్తగా ఏర్పాటు చేయడానికి కూడా కేంద్రం అంగీకరించలేదు.
నిజానికి ప్రతి రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ప్రత్యేకంగా రాజధాని ఎక్స్ప్రెస్ పేరిట రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో భాగంగానే విజయవాడ నుంచి న్యూఢిల్లీకి కొత్తగా ఒక రాజధాని ఎక్స్ప్రెస్ రైలును ఏర్పాటు చేయడం గురించి ఏపీ సర్కారు విన్నపం కేంద్రం వద్ద పెండింగులో ఉంది.
ఈ విషయంలో కూడా కేంద్రం బుధవారం స్పష్టతనిచ్చింది. అమరావతి విశాఖ మీదుగా ఢిల్లీకి రైలు వేస్తారా? అని ఎంపీ మురళీ మోహన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం తెలిసింది. వనరులు, నిర్వహణ పరంగా ఉన్న సమస్యల వల్ల ఈ రైలు ప్రవేశపెట్టడం లేదని తేల్చేశారు.