రంగారెడ్డి భూమిపై ఈడి ఝలక్, పెద్దగా తెలియదు.. అన్నీ సాయికే తెలుసు: జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి గతంలో జప్తుకు ఆదేశించిన 250 ఎకరాల భూమిపై ఎటువంటి లావాదేవీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈడి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
జగన్ కేసుకు సంబంధించి జిల్లాలలోని.. నాటి లెక్కల ప్రకారం రూ.53 కోట్ల విలువైన భూములను గత ఫిబ్రవరిలో జఫ్తుకు ఈడి ఆదేశించింది. క్విడ్ ప్రోకో కేసుకు సంబంధించి జఫ్తు చేసిన ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు జరగకుండా చూడాలని ఆదేశించింది.
మరోవైపు, పెట్టుబడిదారులతో తనకు పరిచయం తక్కువేనని, పొట్లూరి వరప్రసాద్ అంతగా తెలియదని, నిమ్మగడ్డ ప్రసాద్తో పెట్టుబడుల సమయంలోనే పరిచయం ఏర్పడిందని, పెన్నా ప్రతాప్ రెడ్డి తన తండ్రి వైయస్ పరిచయస్తుడని, అన్నీ విజయ సాయి రెడ్డి చూసేవారని వైయస్ జగన్ ఈడికి సమాధానాలిచ్చారు.
పెట్టుబడులపై డివిడెండ్లు కంపెనీ చట్ట ప్రకారమే ఉంటుందన్నారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారాలపై కేసు నమోదు చేసిన ఈడీ.. ప్రధాన నిందితుడైన జగన్కు ప్రశ్నలు సంధించింది. వాటికి జగన్ సమాధానం చెప్పారు.
ఈ సమాచారాన్ని ఇటీవల జగతి పబ్లికేషన్స్కు సంబంధించిన అభియోగ పత్రంతో పాటు ఈడీ ప్రత్యేక కోర్టులో సమర్పించింది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు, పరిచయస్తులు, విదేశీ కంపెనీలు, వ్యాపార వ్యవహారాలు, డెల్లాయిట్ నివేదిక తదితర అంశాలన్నింటిపై ఈడీ ప్రశ్నలు వేసింది.
తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంలో పెట్టుబడిదారుల వ్యూహాలు వారికి ఉన్నాయని జగన్ చెప్పారు. సండూర్ కంపెనీలో విదేశీ కంపెనీలైన 2ఐ, ప్లూరిలు, భారతి సిమెంట్స్లు వికాట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయన్నారు.
సండూర్లో 2ఐ, ప్లూరి కంపెనీలు పెట్టుబడి పెట్టడంపై రాజకీయ ఆరోపణలు రావడంతో వారి ప్రతిష్ఠ దెబ్బతిందని, దీంతో తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలనుకున్నాయని, దీంతో తానే ఆ వాటాలకు ఎక్కువ మొత్తం చెల్లించి కొన్నానని చెప్పారు. డైరెక్టర్ పదవి కోసం ఎవరూ ఎక్కువ పెట్టుబడులు పెట్టలేదన్నారు.
నిమ్మగడ్డ.. తన మొత్తం పెట్టుబడులు ఒకే దాంట్లో పెట్టలేదన్నారు. తాను 2001 నుంచి బెంగళూరులో ఉంటున్నానని, నెలకు రెండుమూడు రోజులు వచ్చి పోతుంటానని, పెట్టుబడుల వ్యవహారాలన్నీ విజయ సాయిరెడ్డే చూసేవారని చెప్పారు. కొందరితో కొంత పరిచయం ఉంటే ఉండవచ్చన్నారు. రఘురాం సిమెంట్స్ పైన విజయసాయికి తెలుసన్నారు.