భువనేశ్వరిని అనే అర్హత లేదు..వైఎస్ జగన్ సతీమణి భారతిలా భువనేశ్వరిపై కేసులు లేవు : టీడీపీ
ఇటీవల రాజధాని రైతుల దీక్షలో పాల్గొన్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని ఎర్రబాలెం లో రైతుల దీక్షకు మద్దతు తెలిపిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు రైతుల దీక్షలో పాల్గొన్నారు. వారి దీక్షకు మద్దతుగా చేతిగాజులు తీసి అమరావతి పరిరక్షణా సమితికి ఇచ్చి అండగా ఉంటామని చెప్పారు భువనేశ్వరి. ఇక అప్పటి నుండి భువనేశ్వరిని టార్గెట్ గా చేసుకుని వైసీపీ మహిళా నేతలు , మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ఇక నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు . ఇక ఈ నేపధ్యంలో టీడీపీ నేతలు భువనేశ్వరిని విమర్శించటంపై మండిపడుతున్నారు.
భువనేశ్వరి రైతులకు గాజులిస్తే వెన్నులో వణుకు పుడుతుందా .. ప్రశ్నించిన టీడీపీ
టీడీపీ మహిళా నాయకురాలు పంచుమర్తి అనూరాధ భువనేశ్వరిపై విమర్శలు చేసే స్థాయి వైసీపీ నేతలకు లేదన్నారు. తీవ్రమైన ఆర్ధిక నేరాలకు పాల్పడి కేసులు ఎదుర్కొంటున్న జగన్ ఇప్పటికి 33 వారాలుగా కోర్టు విచారణలకు హాజరుకాకుండా కుంటిసాకులు చెప్పి తప్పించుకోవడం సిగ్గు చేటు అని ధ్వజమెత్తారు . ఇక ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ వైఎస్ భారతికానీ, షర్మిల కానీ రైతులను పరామర్శించరు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వెళ్లి పరామర్శిస్తే మాత్రం వైసీపీ నేతలకు వెన్నులో వణుకు పుడుతుంది అని విమర్శలు గుప్పించారు .భువనేశ్వరి గాజులిస్తే మీకు భయం దేనికి అంటూ నిలదీశారు.
భారతిలా .. భువనేశ్వరి మీద కేసులు లేవు.. ఆమెను అనే అర్హత లేదు
ఇంకా అంతే కాదు భారతిని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు బుద్దా .. జగన్ సతీమణి భారతిలా భువనేశ్వరి అవినీతికి పాల్పడలేదని ఆమెపై ఎలాంటి కేసులు లేవన్నారు. ఆమె ఏ కేసులోనూ ముద్దాయి కాదని బుద్దా పేర్కొన్నారు . ఇక వై ఎస్ భారతి మనీలాండరింగ్ కేసులో ఐదో నిందితురాలని , ఆమె బ్యాంక్ ఖాతాల నుంచి రూ.23 కోట్లను సీజ్ చేశారని ఆయన మాట్లాడారు . ఆయినా తెలుగుదేశం పార్టీలో మహిళలను విమర్శించరాదనే నియమం ఉంది. అందుకే సంయమనం పాటిస్తున్నామని బుద్దా చెప్పారు .
రాజధాని రైతులను భారతి, షర్మిల పరామర్శించగలరా
ఇకమీదట ఎవరైనా భువనేశ్వరి జోలికి వస్తే సహించేదిలేదు అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులు రాజధాని అమరావతిలోని 29 గ్రామాల్లో ఎక్కడికైనా వెళ్లగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రైతులను పరామర్శించటానికి వెళ్తే ఆమె చేతి గాజులు వారికి విరాళంగా ఇస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టింది. వైసీపీ మంత్రులు అందుకే అచ్చోసిన ఆంబోతుల్లా మాట్లాడుతున్నారు అని దేవినేని మండిపడ్డారు.
భువనేశ్వరిని టార్గెట్ చేసిన వైసీపీ నేతలు.. టీడీపీ నేతల స్ట్రాంగ్ వార్నింగ్
తాజాగా వైసీపీ నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా భువనేశ్వరి గురించి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు చివరి రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ కే అన్నం పెట్టలేని భువనేశ్వరి, తన గాజులు తాకట్టుపెట్టి రాజధాని రైతులకు పరమాన్నం పెడతాను అన్నారట అంటూ ఎద్దేవా చేసిన చేసిన విషయం తెలిసిందే. ఇక డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, బొత్సా వంటి నేతలు భువనేశ్వరి గాజులు ఇవ్వటాన్ని ప్రస్తావిస్తూ గాజులు కాదు ఇవ్వాల్సింది తీసుకున్న భూములు అంటూ వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరితో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.ఇక ఈ నేపధ్యంలోనే టీడీపీ నేతలు భువనేశ్వరి జోలికి వస్తే ఊరుకోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు.