కేబినెట్లో స్ధానంపై నాయిని, బాబుపై కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్ష పదవికి ఈ నెల 20 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. 21న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుందని చెప్పారు.
ఈనెల 23న ఉదయం 11 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. ఉపసంహరణ అనంతరం పోటీలో ఎవరూ లేకుంటే ఎన్నికల ఫలితాల ప్రకటన వెల్లడిస్తామని నాయిని పేర్కొన్నారు. ఒక వేళ పోటీ ఏర్పడితే 24న ఎల్బీ స్టేడియంలో ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు.
ఇక వికారుద్దీన్ ఎన్కౌంటర్పై విచారణ జరుగుతోందని, విచారణలో నిజానిజాలు తెలుస్తాయని అన్నారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్కౌంటర్కు బాధ్యతగా మిమ్మల్ని మంత్రి వర్గం నుంచి తొలగిస్తారనే ప్రశ్నకు గాను ఆ అంశం నా పరిధిలోనిది కాదని, సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు.
తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు మోకాలడ్డు: కేటీఆర్
అభివృద్ధిలో, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పరకాల మండలం వరికోల్లో కేటీఆర్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కేవలం పది నెలలు మాత్రమే అవుతుందని, ఇప్పటికే తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు నెరవేర్చామన్నారు.
మేనిఫెస్టోలో పెట్టని అంశాలను సైతం పథకాలుగా ప్రవేశపెట్టామన్నారు. రూ. 1000 ఫించను ఇస్తామని మాట నిబెట్టుకున్నామన్నారు. రేషన్ బియ్యం పెంపు, సన్నబియ్యం సరఫరా, రైతులకు విద్యుత్తు తదితర అంశాలను ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వం మంచిపనులు చేసినప్పుడు ప్రజల ప్రోత్సాహం అవసరమన్నారు. తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు మోకాలడ్డుతున్నారని అన్నారు. న్యాయపరంగా తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ఏపీ ఇవ్వడం లేదని అన్నారు.