చిక్కుల్లో వైఎస్ జగన్ బావ: అరెస్ట్ తప్పనట్టేనా?
ఖమ్మం: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ, వైఎస్ షర్మిళ భర్త, ప్రముఖ క్రైస్తవ మత ఉపన్యాసకుడు బ్రదర్ అనిల్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. బ్రదర్ అనిల్ కుమార్ న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ అయింది. ముందస్తు బెయిల్ కూడా తీసుకోవడానికి వీలు లేకుండా చేస్తూ.. అరెస్ట్ వారంట్ ను జారీ చేశారు. తెలంగాణలోని ఖమ్మం న్యాయస్థానం ఈ మేరకు బ్రదర్ అనిల్ కుమార్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఆయన ఎన్నిసార్లు సమన్లు జారీ చేసిప్పటికీ..న్యాయస్థానానికి హాజరు కాకపోవడం వల్ల ఈ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ ను జారీ చేశారు.
2009 మార్చి 28వ తేదీన బ్రదర్ అనిల్ కుమార్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఖమ్మం కరుణగిరి ప్రాంతంలో ఒక పార్టీకి అనుకూలంగా ఆయన ప్రచారం చేశారని అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తరువాత ఆయన కరుణగిరిలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కరపత్రాలు పంచారని ఆయనపై రాజకీయ ప్రత్యర్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్రదర్ అనిల్ కుమార్ పై కేసు పెట్టారు పోలీసులు.
ఆ కేసులో ఏ1గా ఉన్న అనిల్ కుమార్ ఇన్నాళ్లూ న్యాయస్థానానికి హాజరు కాలేదు. దీనితో ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచాలని ఖమ్మం సెకెండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి జస్టిస్ ఎం జయమ్మ ఈ నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.