రామోజీ ఫిల్మ్ సిటీలో నాగళ్లు దున్నుతానని అన్నారు: కెసిఆర్పై రాజారాం
హైదరాబాద్: పేదల పేరిట ఉస్మానియా యూనివర్సిటీ భూములను తీసుకోవడం సరికాదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రతినిధి రాజారాం యాదవ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థులదే కీలక పాత్ర అని, ఓయూ భూములు తీసుకోవద్దని కోరారు.
లక్ష నాగళ్లతో దున్నుతానన్న రామోజీ ఫిల్మ్సిటీ ఇప్పుడు స్వర్గంగా కనిపిస్తోందని, విజ్ఞానాన్ని పంచే ఓయూ మాత్రం మెచ్యూరిటీ లేని పోరగాళ్ల కేంద్రంగా కనిపిస్తోందా? అని లేఖలో ముఖ్యమంత్రిని నిలదీశారు. ఓయూ విద్యార్థి నేతగా తల్లిలాంటి వర్సిటీని ధ్వంసం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ఇవాళ కెసిఆర్ సీఎం పీఠంపై ఉన్నారంటే ఓయూ విద్యార్థులే కారణమని రాజారాం తాను రాసిన లేఖలో అన్నారు.
తెలంగాణ సచివాలయంలోని సి బ్లాక్ను ముట్టడించిన హైదరాబాదులని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఓయూ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనను నిరసిస్తూ కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
తమ ఆందోళనలో భాగంగా కొందరు విద్యార్థులు సచివాలయంలో మెరుపు దర్నాలు చేస్తున్నారు. దాంతో సచివాలయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అలాంటివారిని కట్టడి చేయడానికి పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు.
కాగా, విశ్వవిద్యాలయ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తాననే కెసిఆర్ మాటలను కాంగ్రెసు తెలంగాణ నేత వి. హనుమంతరావు ఖండించారు. ఉస్మానియాలాంటి విశ్వవిద్యాలయాల్లో ఇళ్లు కట్టించే ఆలోచనను విరమించుకోవాలని ఆయన కెసిఆర్కు సూచించారు. ఉపయోగంలోకి రాని ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్ల) భూములను స్వాధీనం చేసుకుని, ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన సూచించారు.