చంద్రబాబుకు వారెంటా... తాఖీదు ఇవ్వకుండా ఎలా ఇస్తారు?... రాజకీయ కుట్రే: బుద్ధా వెంకన్న
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అవడంపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి తాఖీదులు ఇవ్వకుండా నాన్బెయిలబుల్ వారెంట్ ఎలా జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు.
ఎప్పుడో ఎనిమిదేళ్ల నాటి కేసుకు సంబంధించి ఇప్పుడు వారెంట్ జారీ చేయడం రాజకీయ కుట్రేనని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణ ఎడారి కాకూడదనే ఆనాడు చంద్రబాబు నాయుడు బాబ్లీ వద్ద నిరసన తెలిపారని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. సీఎంపై కక్ష్య సాధింపు చర్యలను మానుకోవాలని ఆయన సూచించారు. చంద్రబాబుకు జారీ చేసిన అరెస్ట్ వారెంట్పై కేసీఆర్ స్పందించాలని కోరారు.
ఎపి సిఎం చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో సహా మరో 14 మందికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ మేజిస్ట్రేట్ కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గానూ ఆ కోర్టు ఈ వారెంట్ ను జారీ చేసింది. చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.
ఈ నెల 21లోగా చంద్రబాబుతో పాటు మిగతా వారూ హాజరు కావాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. చంద్రబాబు నాయుడికి నోటీసులు రానున్నట్లు గురువారం ఉదయం నుంచే ఊహాగానాలు విన్పిస్తున్నప్పటికీ...ఏకంగా నాన్ బెయిలబుల్ వారంట్ రావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. 2010లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది.
అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ బోర్డర్ దాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు నాన్బెయిలబుల్ కేసు నమోదుచేశారు. అప్పటి నుంచి ఈ కేసు ధర్మాబాద్ కోర్టులో పెండింగ్లో ఉంది.
అయితే ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్ కోర్టులో పిటిషన్ వేయడంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే, దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆ కేసును తవ్వితీయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై చంద్రబాబు, టిడిపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. నేడు సిఎం చంద్రబాబు శ్రీశైలం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.