ఇదేం పాలన?: ఏపీ సర్కారు తీరుపై కాగ్ అక్షింతలు, ‘రూ.76వేల కోట్ల అప్పులు’
అమరావతి: పాలనలో అవకతవకలు, లోటుపాట్లపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక (కాగ్).. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉతికిపారేసింది. ఏపీలో వ్యయ నియంత్రణ, పర్యవేక్షణ బలహీనంగానే ఉన్నాయని, హడావుడిగా నిధులు ఖర్చు చేస్తున్నారని కాగ్ పేర్కొంది.
ఆఖరి త్రైమాసికంలోనే సగానికి పైగా నిధులు ఖర్చు చేసేస్తున్నారని, ఇది సరైన విధానం కాదని తేల్చి చెప్పింది.
మార్చి 2017 నాటికి ముగిసిన సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ సమర్పించిన నివేదికను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తరపున మంత్రి కాలవ శ్రీనివాసులు శుక్రవారం శాసనసభలో ప్రవేశ పెట్టారు. రాష్ట్ర ఆహార కమిషన్ సమర్పించిన 2017-18 వార్షిక నివేదికను పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సభ ముందుంచారు.
కాగా, మొత్తం ఆరు నివేదికలు ఉండగా వాటిలో ఐదింటిని మాత్రమే సమర్పించారు. ప్రభుత్వేతర రంగ సంస్థల నివేదికను ప్రవేశపెట్టలేదు. ప్రాథమిక విద్యకు మౌలిక వసతులే కరవయ్యాయని, బాలల సంఖ్యపై సరైన మదింపు లేదని కాగ్ నిందించింది. బడిమానేసే వారి వివరాల్లో ఒక నివేదికకు మరో నివేదికకు పొంతన ఏదీ అంటూ నిలదీసింది. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించడమేమిటని ప్రశ్నించింది.
రూ.76వేల కోట్ల అప్పు
రాబోయే ఏడేళ్లలో ఏకంగా రూ.76,888 కోట్ల మేర అప్పులు చెల్లించాల్సి ఉందని, ఈ భారం బడ్జెట్లపై ఎంతో ప్రభావం చూపుతుందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాయంటూ మండిపడింది.
ఏంటీ దుర్వినియోగం?
2016-17 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి-నిర్వహణ, రెవెన్యూ వసూలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల తీరు తెన్నులు, స్థానిక సంస్థలకు సంబంధించిన అనేక అంశాలను కాగ్ అధ్యయనం చేసింది. సాధారణ అంశాల్లో భాగంగా జాతీయ రక్షిత మంచినీటి పథకం, ప్రాథమిక, మాధ్యమిక, సాంకేతిక విద్య తీరుతెన్నులను కూలంకషంగా పరిశీలించింది. తిరుపతి కార్పొరేషన్, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
సగంలోనే ప్రాజెక్టులు.. అంచనాలు మాత్రం
‘ఆంధ్రప్రదేశ్లో జాతీయ గ్రామీణ తాగునీటి పథకంలో ఏకంగా రూ.491.83 కోట్ల నిధులు నిష్ఫలమయ్యాయి. రాష్ట్రంలో 271 చిన్న, మధ్య, భారీ తరహా ప్రాజెక్టుల్లో ఏకంగా రూ.28 వేల కోట్లకు పైగా అంచనాలు పెంచేశారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. 64 ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకుపోయాయి. రూ.25,367 కోట్ల మేర నష్టాల్లో చిక్కుకున్నాయి. ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే' అని కాగ్ నివేదిక తేల్చి చెప్పింది.
ఆదాయానికి గండి, నష్టాలు ఇలా..
అంతేగాక, జాతీయ గ్రామీణ నీటి సరఫరా పథకం కింద రాష్ట్రంలో ఏడు పథకాలను నిర్మించినా ప్రారంభించలేకపోయారు. నీటి ఆధారం లేకపోవడమే కారణం. మరో ఏడు మధ్యలోనే ఆగిపోయి రూ.491.83 కోట్లు నిష్ఫలమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో అనేక లోటుపాట్ల వల్ల రూ.607.51 కోట్ల ఆదాయానికి గండి పడింది. దాదాపు 369 కార్యాలయాల్లో తక్కువ పన్ను విధింపు, ఆస్తి విలువ తక్కువగా నిర్ధరించడం, తదితర కారణాల వల్ల ఈ నష్టం వాటిల్లిందని కాగ్ తేల్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మూడు అధ్యాయాలుగా పరిశీలించి మదింపు చేశామని, రాష్ట్ర ప్రభుత్వ వనరులు, వాటి వినియోగాన్ని విశ్లేషించామని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) టుచావాంగ్ వెల్లడించారు. ఆయన విజయవాడలో శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు వివిధ శాఖలకు కేటాయించిన నిధులను నిర్వహించిన తీరును విశ్లేషించామని చెప్పారు.