బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: వణుకుతున్న ఉత్తరాంధ్ర: అతి భారీగా
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వరుస అల్పపీడనాల ప్రభావంతో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రం మొత్తం జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. రోజురోజుకూ వాటి ప్రవాహ తీవ్రత పెరుగుతూనే ఉంది. వరద నీరు పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇప్పటికే రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైంది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
రాయలసీమ, దక్షిణ కోస్తా తీర ప్రాంతాలతో పాటు అన్ని జిల్లాలపై ద్రోణి ప్రభావం కనిపించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అల్పపీడనం బలహీన పడిన సందర్భంలోనూ ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ వరుస వర్షాల నుంచి తెరపి లభించే పరిస్థితి లేదు. బంగాళాఖాతం మధ్యప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో మరో విడత భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. విశాఖపట్నం నగరంలో వర్షం తెరపినివ్వట్లేదు.
ఉరుములు, మెరుపులతో..
తాజాగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో పలుచోట్ల పిడుగలు పడతాయని, స్థానికులు అప్రమత్తంగా ఉండాంటూ హెచ్చరించారు. రాయలసీమ, కోస్తా దక్షిణ ప్రాంతంలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంటుందని చెప్పారు. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరులో వర్షాలు మధ్యాహ్నం నుంచి పడొచ్చు.
మరో రెండు రోజుల పాటు..
మధ్య బంగాళాఖాతం, అండమాన్ ద్వీప సముదాయాలకు ఆనుకుని ఏర్పడిన ఈ అల్పపీడనం మరింత విస్తరించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి సైతం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల ఆరంభమైన వర్షాలు.. మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా..
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. జిల్లాలోని సంతబొమ్మాళిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 88 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. టెక్కలి-60, కవిటి-53, పొలాకి-51, నందిగాం-50, నరసన్నపేట-40, గార-37 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.
Recommended Video
విశాఖలో చిరుజల్లులు..
అల్పపీడన ద్రోణి ప్రభావంతో విశాఖపట్నం నగరంలో కొన్ని గంటలుగా ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. పెందుర్తి, అనకాపల్లిల్లో అత్యధికంగా 12 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పరవాడ-11, భీమిలీ-9, విశాఖనగరం-8, ఆనందపురం-5, పెదగంట్యాడ-4, గాజువాక-3 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. ఈ మధ్యాహ్నానికి విశాఖపట్నంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని, జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ఓ రైతు పిడుగుపాటుకు మరణించాడు.