ఏడేళ్లలో మూడు తుపాన్లు-అన్నీ ఆ రెండు రోజుల్లోనే- ఉత్తరాంధ్రకు చేదు అనుభవాలు
ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతానికీ తుపానులకు అవినాభావ సంబంధముంది. అదీ గత ఏడేళ్లలో మారిన వాతావరణ పరిస్ధితుల్లో ఈ ప్రాంతం ఎదుర్కొన్న తుపానులు ఎంతో తీవ్రమైనవి. అసలే వెనుకబాటు, ఆపై తుపాన్ల గండం ఎప్పుడూ ఈ ప్రాంతాన్ని వెంటాడుతుంటుంది. గత ఏడేళ్లలో మూడు తీవ్రమైన తుపాన్లను ఎదుర్కొన్న ఈ ప్రాంతానికి ఇప్పటికీ ఇవి చేదు జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. అదీ ఆ రెండు తేదీల్లోనే ఆ మూడు తుపానులు ఎదుర్కోవాల్సి రావడం మరో విశేషం. ఇప్పుడు తాజాగా వాయుగుండం ప్రభావం నేపథ్యంలో ఉత్తరాంధ్ర వాసులు వాటిని గుర్తుచేసుకుంటున్నారు.
ఒడిశా తుపాను సహాయ చర్యల్లో తెలంగాణ విద్యుత్ సిబ్బంది..! యుద్ద ప్రాతిపదికన పనులు..!!
ఉత్తరాంధ్ర తుపానులు...
ఉత్తరాంధ్ర తీర ప్రాంతం గత ఏడేళ్లలో మూడు తీవ్రమైన తుపానులు ఎదుర్కొంది. ఇవన్నీ కేటగిరీ 4,5 హరికేన్ల పరిధిలోకి వచ్చేవే. ఈ మూడు తుపాన్లూ ఉత్తరాంధ్రలోని విశాఖ నగరంపై విరుచుకుపడటం కానీ పొరుగున ఉన్న జిల్లాల్లో తీరం దాటడం కానీ జరిగినవే. ఇవి సృష్టించిన విధ్వంసం మాటలకందనిది. నష్టం అంచనాలకు అందనిది. వీటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఎంతో తీవ్రంగా శ్రమించాయి. ప్రాణనష్టాన్ని తగ్గించగలిగినా భారీ ఆస్తినష్టం మాత్రం తప్పలేదు. అంతే కాదు వీటి కారణంగా ప్రజలు కొన్ని రోజుల పాటు ఆకలి దప్పులతో అలమటించిన పరిస్ధితులు తలెత్తాయి. ఇవి ఉత్తరాంధ్ర ప్రజలకు ఇప్పటికీ చేదు జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి.
ఫైలిన్ తుఫాను
2013 అక్టోబర్ 12న వచ్చిన ఫైలిన్ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర అతలాకుతలమైంది. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ఫైలిన్ తీవ్ర ప్రభావం చూపింది. వాస్తవానికి ఇది ఏపీ తీరం దాటి ఒడిశాలోని గోపాల్ పూర్ వద్ద తీరం దాటినా ఉత్తరాంద్రపై మాత్రం తీవ్ర ప్రభావం తప్పలేదు. భారీగా ఆస్త్రి నష్టం సంభవించింది. ప్రాణనష్టం కూడా జరిగింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా నష్టాన్ని తగ్గించడానికి మాత్రమే అవి పనికొచ్చాయి. దీంతో ఉత్తరాంధ్రపై ఇది చూపిన ప్రభావం ఎప్పటికీ గుర్తుండిపోయింది. ఇప్పుడు మరోసారి వాయుగుండం రూపంలో ఉత్తరాంధ్ర వద్ద తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారడంతో ప్రజలు దీన్ని గుర్తుచేసుకుంటున్నారు.
హుదుద్ తుపాను
2014 అక్టోబర్ 12న వచ్చిన హుదుద్ తుపాను ఉత్తరాంధ్రకు మరో చేదు జ్ఞాపకం. అప్పట్లో ఫైలిన్ తుపాను అనుభవాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్న ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను భారీస్ధాయిలో అప్రమత్తం చేసింది. ముఖ్యంగా విశాఖ నగరానికి భారీ నష్టం తప్పదనే అంచనాలు ముందే రావడంతో ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచింది. అనుకున్నట్లుగానే హుదుద్ తుపాను విశాఖపై విరుచుకుపడింది. 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు టెలీకమ్యూనికేషన్ వ్యవస్ధలతో పాటు విద్యుత్ వ్యవస్ధలూ భారీగా దెబ్బతిన్నాయి. తుపాను ధాటికి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 124 మంది చనిపోయారు. విశాఖ నగరంలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తిష్టవేసి మరీ సహాయకచర్యలు పర్యవేక్షించాల్సి వచ్చింది.
తిత్లీ తుపాను..
2018లో వచ్చిన తిత్లీ తుపాను ఉత్తరాంధ్రపై మరోసారి తీవ్ర ప్రభావం చూపింది. అక్టోబర్ 11న శ్రీకాకుళం జిల్లాలోని పలాస వద్ద తీరాన్ని దాటిన ఈ సూపర్ తుపాను ఉత్తరాంధ్ర మూడు జిల్లాలపై ఊహించని ప్రభావం చూపించింది. ఈ తుపాను ధాటికి ఉత్తరాంధ్రలో 8 మంది చనిపోగా.. ఒడిశాలో అయితే 77 మంది మృత్యువాత పడ్డారు. ఈ తుపాను కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. భారీగా పంట నష్టం కూడా తప్పలేదు. తిత్లీ తుపాను సహాయక చర్యలు కూడా దాదాపు రెండు నెలల పాటు సాగాయి. అయినా ప్రజలకు పూర్తి స్ధాయిలో ఊరట దక్కలేదు. ప్రభుత్వం అందించిన సాయంపైనా విమర్శలు తప్పలేదు. దీంతో తుపాను పేరు చెబితేనే ఉత్తరాంధ్ర ప్రజలు వణికిపోయే పరిస్ధితి వచ్చింది. ఇప్పుడు తీవ్ర వాయుగుండం కూడా ఉత్తరాంధ్రపై ప్రభావం చూపుతుండటంతో ఈ ప్రాంత వాసులు భయపడుతున్నారు.