మీరు భయపడుతున్నారు: పవన్ కళ్యాణ్ విశాఖ సభకు నారా లోకేష్ కౌంటర్
అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం తెలుగుదేశం పార్టీ మాత్రమే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తోందని ఆ పార్టీ నేత, మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. విశాఖపట్నం జనసేన కవాతులో ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై శనివారం రాత్రి ఆయన ట్వీట్ ద్వారా స్పందించారు.
ప్రతిపక్ష పార్టీల నాయకులు కనీసం నరేంద్ర మోడీ పేరు ఎత్తడానికి ఎందుకు భయపడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారి వారు ఇచ్చిన స్క్రిప్టును మాత్రమే ఎందుకు చదువుతున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంను హుధుద్ వణికించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు రికార్డు సమయంలో నగరాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చారన్నారు. తర్వాత విశాఖపట్నాన్ని దేశంలోనే మూడో పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దారన్నారు.
దీనిని విశాఖపట్నం వాసులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధి మీకు కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని, రెచ్చగొట్టే ధోరణి వల్ల రాష్ట్రానికి వస్తున్న కంపెనీలు భయపడి విశాఖను వదిలి వెళ్లే పరిస్థితి రాకూడదన్నారు.