నిప్పుల కొలిమి ఉత్తరాంధ్ర! కోస్తా, సీమ జిల్లాల్లో చిరుజల్లులు
అమరావతి: వేసవి ఆరంభానికి ముందే ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండ తీవ్రతకు ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ప్రత్యేకించి- వృద్ధులు, చిన్నారులు అల్లాడుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ మంట పుట్టించేస్తోంది. ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉత్తరాంధ్రలో ఎండ తీవ్రత మరింత అధికంగా ఉంటోంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణం కంటే రెండు డిగ్రీల మేర అధికంగా పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. కోస్తా, రాయలసీమల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో పోల్చుకుంటే కోస్తా జిల్లాల్లో ఎండ వేడి కాస్త తక్కువే. ఈ ఏడాది కోస్తాలో కూడా వేడి తీవ్రత ఎక్కువగా నమోదవుతోంది.
ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు నిప్పుల కొలిమిలా తయారయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎండ మాడు పగులగొడుతోంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో 44.7, విశాఖపట్నం శివార్లలోని ఆనందపురంలో 43.9, విజయనగరం జిల్లా సాలూరులో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతవారణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాలో మిగిలిన చోట్ల కూడా ఎండ తీవ్రత కొనసాగింది. కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అన్నారు. అత్యధికంగా తిరుపతిలో 42.6, కర్నూలులో 42.1 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు.
విశాఖలో రేవ్ పార్టీ కల్చర్ .. బీచ్ రిసార్ట్స్ లో భారీగా డ్రగ్స్ కలకలం
మరో 24 గంటల్లో ఎండలు ఇలాగే కొనసాగుతాయని వెల్లడించారు. ఆ తర్వాత కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, దీంతో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గుతుందని చెప్పారు. ఎండ తీవ్రతకు రోజువారీ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణు లు హెచ్చరిస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ సారి ఎండల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వడగాలులు వీచే ప్రమాదం ఉందని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 46 నుంచి 47 డిగ్రీల వరకు నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.