స్నేహం కోసం కట్టుబడతాం;కుదరక పోతే..అదే చెప్పి దండం:బిజెపిపై చంద్రబాబు
అమరావతి: టిడిపి స్నేహం చేస్తే దానికి కట్టుబడి ఉంటుందని, మిత్రధర్మాన్ని పాటిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. అంతేగాని గొడవ చెయ్యమని...మరీ కుదరని పరిస్థితి వస్తే ఆ మాటే చెప్పి దండం పెడతాం తప్ప న్యూసెన్స్ చేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. బిజెపితో స్నేహ సంబంధాల గురించి టిడిపి అధినేత స్ఫష్టత ఇచ్చారు.
ఆదివారం ఉండవల్లిలోని సీఎం నివాసం పక్కనే ఉన్న గ్రీవెన్స్ హాల్లో టీడీపీ రాష్ట్ర స్థాయి వర్క్షాపు జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు అసహనం తెలియజేశారు. ఇందుకు సమాధానంగా టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడుతూ "ఒకసారి స్నేహం చేస్తే టీడీపీ దానికి కట్టుబడి ఉంటుంది. మిత్రధర్మాన్ని పాటిస్తుంది. రోజూ గొడవ పెట్టి రచ్చ చేసే పార్టీ కాదు మనది. ఏవైనా సమస్యలుంటే అంతర్గతంగా చెబుతాం తప్ప బయట రోడ్డెక్కడం ఉండదు. మరీ కుదరని పరిస్థితి వస్తే ఆ మాటే చెప్పి దండం పెడతాం తప్ప న్యూసెన్స్ చేయం. ఇంతకు ముందైనా.. ఇప్పుడైనా.. రేపైనా మన వైఖరి ఇదే" అని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి రావాల్సిన వాటి విషయంలో...రాజీ పడను...
"రాష్ట్రానికి రావలసిన వాటి విషయంలో రాజీపడను...కొన్ని పార్టీలు లోపల రాజీపడి బయట మాట్లాడతాయి. మనం బయట మాట్లాడకుండా లోపల మాట్లాడుతున్నాం. మనకు రావలసిన వాటి కోసం పది సార్లయినా.. ఇరవై సార్లయినా ఢిల్లీ చుట్టూ తిరుగుతాను. అది తప్పేం కాదు. న్యాయం జరిగేవరకూ ప్రయత్నం విరమించేది లేదు. ప్రజలు నష్టపోకుండా వ్యూహాత్మకంగా వెళ్లాలి. మనం ఆవేశంతో తప్పటడుగు వేస్తే రాష్ట్రం, ప్రజలు నష్టపోతారు. నేను ఖాతాను మూయలేదు. తెరిచే ఉంచాను. రావలసినవి రాబట్టుకోవడానికి ఒత్తిడి తెస్తూనే ఉంటాను. మోదీ మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను"...అని చంద్రబాబు తన వైఖరి తెలియచెప్పారు.
నాలాంటి సీనియర్లతో చర్చించకుండా...కాంగ్రెస్ ద్రోహం...
రాష్ట్ర విభజన సమయంలో తన వంటి సీనియర్లతో కూడా సంప్రదింపులు జరపకుండా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ద్రోహం చేసిందని చంద్రబాబు విమర్శించారు. కొత్త రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లు కావాలని తాను అడిగితే 20 లక్షల కోట్లయినా ఇస్తామంటూ దిగ్విజయ్సింగ్ హేళనగా మాట్లాడారని గుర్తుచేశారు. దానికి ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన ప్రతిఫలం అనుభవించిందని, మూడున్నరేళ్ల తర్వాత జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో కూడా ఆ పార్టీకి కేవలం 800 ఓట్లు వచ్చాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
కసితో అభివృద్ది...
దీంతో కసితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పిన తాను...అందుకోసం ప్రతి నిమిషం పనిచేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. అన్నీ బాగున్న రాష్ట్రాలు సాధించలేకపోయిన వాటిని కూడా ఈ రాష్ట్రంలో సాధించామని, నూరు శాతం విద్యుత్ సరఫరా, నూరు శాతం గ్యాస్ కనెక్షన్లు, నూరు శాతం మరుగుదొడ్లు ఇచ్చామని తెలిపారు. హైదరాబాద్ను ఎలా అభివృద్ధి చేసి చూపించామో అమరావతిని కూడా అలాగే చేసి చూపిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.