ఏపీలో కాదు..కేంద్రంలో చక్రం తిప్పాలి..! అందుకోసం ఆ ఎనిమిది గెలావాలంటున్న గబ్బర్ సింగ్..!!
అమరావతి/ హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు బాగా వంటపట్టినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ శాసన సభలో అడుగు పెడితే చాలు సత్తా చూపించొచ్చు అన్న జనసేనాని ఇప్పుడు గళాన్ని మార్చారు. శాసన సభే కాదు పార్లమెంట్ లో కూడా జనసేన గొంతు వినిపించాలని ప్రణాళికలు రచిస్తున్నారు పవన్. అందుకోసం ఏపిలోని ఎనిమిది లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాబోవు ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి కనీసం ఐదు స్థానాల్లో గెలిస్తే దేశ రాజధానిలో చక్రం తిప్పొచ్చనేది జనసేనాని వ్యూహంగా తెలుస్తోంది.
దేశ రాజకీయాల వైపు జనసేనాని చూపు..! పార్లమెంట్ లో గళం విప్పాలని తహతహ..!!
ప్రశ్నిస్తానని జనసేన పార్టీని స్థాపించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. 2014 ఎన్నికల కంటే ముందే పార్టీని ఏర్పాటు చేసినా, అప్పుడు పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో లేదని పోటీకి దూరంగా ఉన్నారు. అంతేకాదు, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు. గత సంవత్సరం జరిగిన జనసేన నాల్గవ ఆవిర్భావ సభ నుంచి గబ్బర్ సింగ్, టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో స్పీడు పెంచేశారు గబ్బర్ సింగ్. అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్ సభ స్థానాలకు కూడా పోటీ చేసి నెగ్గాలని కాటమరాయుడు క్రుతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.
ఎన్నికలకు అంతా సిద్దం..! ఎప్పుడైనా రెఢీ అంటున్న గబ్బర్ సింగ్..!!
ఎన్నికల కోసం ఆయన ప్రచార ప్రక్రియను ప్రారంభించారు. సోషల్ మీడియా సాయంతో ఆ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు స్థానిక నాయకులు శ్రీకారం చుట్టారు. ప్రచార రథాలను సైతం సిద్ధం చేశారు. మరోవైపు, జనసేన పార్టీ విధానాలు, నినాదాలు, లక్ష్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ ఏకంగా సాంస్కృతిక శాఖను ఏర్పాటు చేసుకుంది. ఈ శాఖ జనసేన నినాదాలను తయారు చేసి కార్యకర్తల ద్వారా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. అదేవిధంగా పవన్ మాటలు, పాటలను మిక్స్ చేసి వాటిని అన్ని గ్రామాల్లో ప్రచారం చేసే కార్యక్రమానికి ఈ శాఖ ఇప్పటికే శ్రీకారం చుట్టింది.
175 స్థనాల్లో పోటీ..! ఏదీ వదిలిపెట్టం అంటున్న జనసైనాని..!!
మరోవైపు ఈ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండడంతో ముక్కోణ పోటీ జరిగే అవకాశాలు ఉన్న నియోజకవర్గాలను ఎట్టి పరిస్థితుల్లో వదలుకోకూడదని ఆ పార్టీ భావిస్తోంది. మెజారిటీ స్థానాలు సాధిస్తే, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం ఒక ఎత్తైతే, అత్యదిక లోక్ సభ స్థానాలు కైవసం చేసుకుని ఢిల్లీ వరకు జనసేన గళం వినిపించాలనేది పవన్ వ్యూహంగా తెలుస్తోంది. అందుకే అసెంబ్లీ తో పాటుగా పార్లమెంట్ సీట్లపై జనసేనాని కన్నేసినట్టు తెలుస్తోంది.
ఎనిమిది లోక్ సభ స్థానాల్లో పోటీ..! ప్రభావం చూపిస్తామంటున్న పవన్..!!
అందుకోసం ఆయన రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాల్లో ఏడింటిని బాగా టార్గెట్ చేశారనే చర్చ జరుగుతోంది. రాజమండ్రి, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు తో పాటు అమలాపురం లోక్ సభ స్థానాలపై కాటమరాయుడు గురి పెట్టినట్టు తెలుస్తోంది. వీటిలో గుంటూరు ఒక్క స్థానానికే అభ్యర్థిని ప్రకటించిన పవన్, మిగిలిన ఏడు స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని జనసైనాని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందు కోసం సొంత ఇమేజ్తో ఆర్థిక స్థోమత, ఓట్లు సంపాదించుకునే సామర్థ్యం ఉన్న నేతల కోసం గబ్బర్ సింగ్ అన్వేషణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.