చంద్రబాబుకు కాదు...జీవీఎల్కే చుక్కలు:సోమిరెడ్డి, సిఎం ఆదేశాలతోనే దాడా:ఎమ్మెల్యే విష్ణుకుమార్
విజయవాడ:తిరుపతి ఘటనలో టీడీపీ కార్యకర్తలే గాయపడ్డారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమ పార్టీనే అధికారంలో ఉన్నా పోలీసులు టీడీపీ కార్యకర్తలపైనే దాడి చేశారని మంత్రి సోమిరెడ్డి చెప్పారు. అమిత్ షాపై అసలు దాడే జరగనప్పుడు పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందని ఎదురు ప్రశ్నించారు.
ఎపికి ప్రత్యేక హోదా ఉద్యమం ప్రశాంతంగా జరగాలని తాము కోరుకుంటున్నామని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి బిజెపి ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. అయితే చంద్రబాబుకు కాదు...జీవీఎల్కే త్వరలో చుక్కలు కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. కర్ణాటక ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. మోదీ, అమిత్షాకు ప్రజలు బుద్ధిచెప్పాలని మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఇదిలా వుండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాపై దాడిని ఆ పార్టీ నేత విష్ణుకుమార్రాజు ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా పై టిడిపి కార్యకర్తలు కావాలనే దాడి చేశారా?...లేక సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దాడి చేశారో తేలాల్సి ఉందని ఆయన అన్నారు. అయితే అమిత్షాకు భద్రత కల్పిచడంలో పోలీసులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
దీనికి బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని విష్ణుకుమార్రాజు డిమాండ్ చేశారు. టిడిపి కార్యకర్తలు గూండాల్లా వ్యవహరించారని, వారిని జైల్లో పెట్టాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. టిడిపి కార్యకర్తలు ఏపీ ప్రజల పరువు తీశారన్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి గెలవదని విష్ణుకుమార్రాజు పునరుద్ఘాటించారు.